వెల్దుర్తి, మార్చి 5: పార్మిశుధ్య కార్మికులకు వెంటనే వేతనాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మాసాయిపేటలో టీఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు మొదటి తేదీ నుంచి వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం.. పంచాయతీ కార్మికులను మాత్రం చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. అరకొర వేతనాలతో బతుకులు వెళ్లదీస్తున్న పంచాయతీ కార్మికులకు వేతనాలు ఆలస్యం అయితే కుటుంబాలు గడవడం కష్టమవుతుందని తెలిపారు. సమావేశంలో యువసేన రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణ, హరిప్రసాద్, భిక్షపతి, లింగం, స్వామి తదితరులు పాల్గొన్నారు.