ఆలేరు, మార్చి 9 : రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయకపోవడం బాధాకరమని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. దేశాన్ని శుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు మ్యాన్హోల్స్లో దిగి ఊపిరాడక చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మీడియాతో మాట్లాడారు. విద్యుత్తు, విద్య, వైద్యం, మైనింగ్ తదితర శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్న ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను విస్మరించడం బాధాకరమని అన్నారు. కార్మిక చట్టాల ప్రకారం పారిశుధ్య కార్మికులకు అధునాతన పరికరాలు ఇవ్వాలని, వాటి ద్వారానే పనులు చేయించాలని కోరారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల్లో అత్యధిక శాతం మాదిగలేనని, అందుకే ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు.