ముషీరాబాద్, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో దళితుల గురించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఒక్కరే పట్టించుకున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని భావిస్తున్న సీఎం కేసీఆరే.. దళిత బంధు పథకం అమలును స్వయంగా పర్యవేక్షించాలని కోరారు.
గతంలో ఏ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పట్టించుకోకపోవడంతో దళితులు నిరాదరణకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక చొరవ తీసుకొని దళితుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. గురువారం విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. దళితబంధు పథకం అమలులో ఎమ్మెల్యేల జోక్యం లేకుండా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ద్వారా అమలు చేస్తే అసలైన నిరుపేదలకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నదని చెప్పారు.