హైదరాబాద్ : సత్తుపల్లి పాత సెంటర్ వద్దనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆవిష్కరించారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి, లోకసభలో టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పలువురు ఉపాధ్యాయులను నాయకులు శాలువాలతో సత్కరించారు. ఎంపీలు నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధులను ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అంతకుముందు పాఠశాలకు వచ్చిన అతిథులకు పూలు చల్లుతూ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.