కమ్మర్పల్లి, మార్చి 26: సర్వీస్ రిజిస్టర్ ఇచ్చేందుకు తోటి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి ఎంపీడీవో కార్యాలయంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కమ్మర్పల్లి మండల పంచాయతీ అధికారిగా పనిచేసిన భాగయ్య బదిలీపై ఇందల్వాయి మండలానికి వెళ్లారు. ఈ క్రమంలో తన సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్) ఇవ్వాలని ఎంపీడీవో సీ సంతోష్రెడ్డిని కోరగా.. రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సంతోష్రెడ్డి ఇటీవలే కామారెడ్డి జిల్లా భిక్కనూర్కు బదిలీ అయ్యారు. అయితే.. లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండానే తన ఎస్ఆర్ తీసుకోవచ్చని ఆశించిన భాగయ్య.. సీనియర్ అసిస్టెంట్ హరిబాబు వద్దకు వెళ్లగా ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వనిదే సర్వీస్ బుక్ ఇవ్వొద్దని బదిలీపై వెళ్లిన ఎంపీడీవో సంతోష్రెడ్డి ఆదేశింశారు. దీంతో భాగయ్య ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు మంగళవారం కమ్మర్పల్లి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. వారి ముందే భాగయ్య ఎంపీడీవో సంతోష్రెడ్డికి ఫోన్ చేసి తన సర్వీస్ రిజిస్టర్ ఇవ్వాలని కోరారు. ఈ మధ్యనే డీజిల్, తదితర బిల్లులు బాగానే వచ్చాయి కదా.. ఈ మాత్రం డబ్బులు ఇస్తే తప్పేముందని సంతోష్రెడ్డి బదులిచ్చారు. చేసేదిలేక బాధితుడు సీనియర్ అసిస్టెంట్ హరిబాబుకు రూ.8 వేలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెండ్గా పట్టుకున్నారు. సంతోష్రెడ్డి ఆదేశాలతోనే తాను డబ్బులు తీసుకున్నట్టు హరిబాబు ఏసీబీ అధికారులకు తెలిపాడు. దీంతో భిక్కనూర్లో ఎంపీడీవో సంతోష్రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కమ్మర్పల్లి ఎంపీడీవో కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. సంతోష్రెడ్డి, హరిబాబులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు.