హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు, పర్యావరణం, అడవులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ (MP Santhosh Kumar) ఇటీవల మహారాష్ట్రలోని (Maharashtra) తిప్పేశ్వర్ వైల్డ్లైఫ్ శాంక్చురీలో (Tipeshwar Wildlife Sanctuary) పర్యటించారు. ఆయన పర్యటన విశేషాలను మహారాష్ట్ర అటవీ అధికారులు మ్యాజికల్ మెల్ఘాట్ ట్విట్టర్ పేజీ (Magical Melghat) ద్వారా పంచుకున్నారు. ఎంపీ సంతోష్ తీసిన జంతువులు, పక్షుల ఫోటోలను కూడా అందులో జతచేశారు. తన పర్యటనలో తిప్పేశ్వర్ అటవీ అందాలను, విభిన్నజంతు సంపదను కెమెరా ద్వారా బంధించిన ఎంపీకి మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ జయోతి బెనర్జీ, తిప్పేశ్వర్ డీఎఫ్ఓ కిరణ్ జగ్తప్ మర్యాదపూర్వకంగా ఎంపీ సంతోష్ కుమార్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల వెంట అటవీ రక్షణ, పులుల సంచారంపై చర్చించారు. అడవులు, పర్యావరణ రక్షణకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా చేపట్టిన స్ఫూర్తివంతమైన పనులను ఈ సందర్భంగా మహారాష్ట్ర అధికారులకు ఎంపీ వివరించారు. తన పర్యటనకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. అందమైన అడవులు, వన్యప్రాణులను చూసేందుకు త్వరలోనే మరోసారి పర్యటించేందుకు ప్రయత్నిస్తానని ఎంపీ అన్నారు.
Thank you so very much @jayotibanerjee ji and @KiranJagtap123 ji . You are such an amazing host. Thank you for all the help. Would certainly look forward to see you and the beautiful wildlife again soon 👍. https://t.co/jBqcEy6lAN
— Santosh Kumar J (@SantoshKumarBRS) April 22, 2023
వీలున్నప్పుడల్లా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, తన కెమెరా ద్వారా ప్రకృతి అందాలు, పక్షులు, వన్యప్రాణుల చిత్రాలను తీయడం.. వాటిని ప్రతీ ఆదివారం వీక్లీ డోస్ ఆఫ్ మై ఫోటోగ్రఫీ శీర్షికతో ట్విట్టర్ ద్వారా ఎంపీ సంతోష్ కుమార్ కొన్నేళ్లుగా పంచుకుంటున్నారు.