హైదరాబాద్, సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఎన్బీఎఫ్సీ అవాన్స్ ఫైనాన్షియల్ వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లోని గ్రాండ్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ గైండా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులందరికీ విద్యారుణాలను అందజేస్తున్నామన్నారు. అలాగే, నూతన నైపుణ్యాలను పొందేందుకు, విద్యాసంస్థలు తమ మౌలిక వసతులను మెరుగుపర్చుకునేందుకు తమవంతు ఆర్థిక వనరులు సమకూర్చుతున్నామన్నారు. తెలంగాణతోపాటు ఏపీ, పంజాబ్, మహారాష్ట్రలోని విద్యార్థుల్లో అత్యధిక మంది విదేశాల్లో చదువడానికి ఆసక్తి చూపుతున్నారని, ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. కంపెనీ మొత్తం రుణ వితరణలో హైదరాబాద్ వాటా 11 శాతంగా ఉన్నదని, ఈ ఏడాది చివరినాటికి 15-20 శాతానికి చేరుకునే అవకాశం ఉన్నదన్నారు.