హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ హెటెక్స్లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన 14వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి అందించిన సహకారం మరువలేనిదన్నారు. పౌల్ట్రీ పరిశ్రమతో పాటు అన్నిరంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఆయన.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే అది పౌల్ట్రీ పరిశ్రమతోనే సాధ్యమవుతుందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు గుడ్డును అందిస్తుందన్నారు. ఇలాంటి పథకాలు దేశంలోని అన్ని ప్రాంతాలు, ముఖ్యమంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలకు సూచించారు. కరోనా, ఇతర సమస్యలతో కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తిలో నష్టం ఎక్కువ నష్టాలున్నాయని, పౌల్ట్రీ రైతులకు వ్యవసాయ హోదా కల్పించి, సబ్సిడీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కార్యక్రమంలో ప్రతినిధులు డాక్టర్ తిరుపతి రెడ్డి, హర్షరెడ్డి, రాంరెడ్డి, ఫౌల్ట్రీ రైతులు పాల్గొన్నారు.