హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు సచ్చేదిన్ దాపురించిందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలు జీడీపీ పెంచాలని ఆశిస్తుంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోలు ధరలను పెంచుతున్నదని మండిపడ్డారు. బుధవారం లోక్సభలో ఆయన 377 నిబంధన కింద కేంద్రాన్ని నిలదీశారు. ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు గ్యాస్ సిలిండర్ ధరను 2014తో పోలిస్తే ప్రస్తుతం 2.5 రెట్లు పెంచిందని వివరించారు. ఉదహరణకు ఈ సంవత్సరం మార్చిలో ఎల్పీజీ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.1100 ఉంటే ఈనెల 6న రూ.50 పెరిగిందని, దీంతో మొత్తం రూ.1150కి చేరిందన్నారు. 2014 మార్చిలో కేవలం రూ. 410 ఉందన్నారు. ఈ నేపథ్యంలో పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఐదు సంవత్సరాల్లో రూ.20 కోట్లు
వాణిజ్యపరంగా ఎంతో కీలకమైన తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం చిన్న చూపు, వివక్ష కొనసాగుతున్నది. కనీస స్థాయిలో కూడా నిధులు విడుదల చేయడంలేదు. వాణిజ్య మంత్రిత్వ శాఖ ద్వారా గత ఐదు సంవత్సరాల్లో కేంద్రం నుంచి తెలంగాణకు రూ.20.04 కోట్లను ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. ఎంతో కీలకమైన ఈ శాఖ ద్వారా కేవలం ఇరవై కోట్లకు మించి తెలంగాణకు సహాయం అందలేదు. వాణిజ్య మంత్రిత్వ శాఖ ద్వారా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం, సెంట్రల్ సెక్టార్ స్కీంల ద్వారా ఎంత మొత్తం విడుదల చేశారంటూ లోక్సభ సభ్యుడు రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గత ఐదు సంవత్సరాల్లో వాణిజ్య శాఖ ైస్పెస్ బోర్డుకు రూ.8.86 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. జ్యూయలరీ సెక్టార్కు రూ.4.12 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆప్గ్రేడేషన్ స్కీం కింద పాశమైలారానికి మొదటి విడతగా రూ.7.068 కోట్లు ఇచ్చినట్టు మంత్రి సమాధానంలో పేర్కొన్నారు.