చేవెళ్ల: యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మహోత్తరమైన కార్యంలో నేను సైతం అంటూ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ముందుకొచ్చారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి కిలో ఒక తులం బంగారం సమర్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే తన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా విరివిగా విరాళాలు సేకరించి సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఆలయానికి అందిస్తామని ప్రకటించారు.
ఆలయానికి త్వరలో చేయనున్న విమాన గోపురం బంగారు తాపడానికి కిలో ఒక తులం బంగారాన్ని సమర్పించడానికి ఆయన ముందుకు వచ్చారు. త్వరలోనే ఈ బంగారాన్ని నిర్ణీత పద్ధతిలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా స్వామి వారికి సమర్పిస్తామని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక వజ్రసంకల్పానికి ఉడుతా భక్తిగా, తన వంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎంపీ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొత్తం తెలంగాణనే బంగారు తెలంగాణగా సీఎం కేసీఆర్ మారుస్తున్నారని, అందులో భాగంగా జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల ఉద్ధరణ, చరిత్రాత్మక పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తూ పూర్వ వైభవం తెస్తున్నారని కొనియాడారు.
అన్ని దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల కోసం తగు ఆర్థిక సాయం అందించారని చెప్పారు. ప్రత్యేకించి యాదగిరి గుట్టను యాదాద్రిగా సమున్నతంగా, శిల్పకళా సౌందర్యంతో, భక్తి పారవశ్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.
అలాగే, తన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలను సేకరించి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి అందజేస్తామని పేర్కొన్నారు.