హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్రపన్ని రెడ్హ్యాండెడ్గా దొరికిన దొంగల పార్టీ బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని టీఆర్ఎస్ ఎంపీలు తేల్చిచెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపుతో దేశమంతా తెలంగాణ మాడల్ను కోరుకుంటున్నట్టు తేలిపోయిందని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలుకబోతున్నని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎంపీలు వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు సోమవారం మీడియాతో మాట్లాడారు. మునుగోడులో బీజేపీ ఓడిపోయినా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని ఎంపీ వెంకటేశ్ నేత విమర్శించారు.
కేంద్రంపై సీఎం కేసీఆర్ ధర్మయుద్ధం చేస్తున్నారని, మునుగోడు ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టి తమ స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తమ బండారం బయటపడుతుందన్న భయంతో ఆయనను అడ్డుకోవాని మోదీ, అమిత్షా కుట్రలు పన్నుతున్నారని ధ్వజమమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ, అమిత్షా యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారని, బీజేపీ డ్రామా కంపెనీలా మారిందని దుయ్యబట్టారు. ప్రపంచ ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీలను హైదరాబాద్లో స్థాపించేందుకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్పై వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు వివేక్కు లేదన్నారు. తెలంగాణ మాడల్ దేశానికి కావాలని, బీఆర్ఎస్తో సీఎం కేసీఆర్ దేశ ముఖచిత్రాన్ని మారుస్తారనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎంపీ మన్నే శ్రీనివాస్రెడ్డి చెప్పారు. బీజేపీ అబద్ధాలను మునుగోడు ప్రజలు నమ్మలేదని చెప్పారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా తమ నీతిమాలిన చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి: కవిత
ధర్మాన్ని నిలబెట్టిన మునుగోడు ప్రజలకు ఎంపీ మాలోత్ కవిత ధన్యవాదాలు చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ను విమర్శించే హక్కు బీజేపీ నేత వివేక్కు లేదన్నారు. రాజకీయాల్లో అట్టర్ఫ్లాప్ నేత వివేక్ అని విమర్శించారు. నాడు హుజూరాబాద్ ఎన్నికల్లో.. ఇటీవల మునుగోడు ఎన్నికల సమయంలో పట్టుబడ్డ పైసలు వివేక్వేనన్నారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆమె సూచించారు.
2023లో బీజేపీకి డిపాజిట్ రాదు: ఎమ్మెల్సీ భానుప్రసాద్
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కుటిల యత్నాలు చేసిన బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన బుద్ధిచెప్పారని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అన్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీకి ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో అన్నింటిని టీఆర్ఎస్, మిత్రపక్షాలే కైవసం చేసుకుంటాయని చెప్పారు. దేశంలో ఇతర రాష్ర్టాల్లో రాజకీయాలు చేసినట్టు తెలంగాణలో చేస్తే సాగవని హెచ్చరించారు.