లోక్సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ నామా
సభ్యులకు సమాన అవకాశాలివ్వాలని సూచన
హైదరాబాద్, ఫిబ్రవరి 4 : ప్రజారోగ్యానికి ఏయే చర్యలు తీసుకుంటున్నదని పార్లమెంట్లో టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజల సుస్థిర ఆరోగ్యానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఒక శాతం కేటాయించాలని డబ్ల్యూహెచ్వో సూచించిందని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలేమిటని శుక్రవారం లోక్సభలో అడిగారు. ఈ ప్రశ్నకు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయటానికి నేషనల్ హెల్త్ మిషన్, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకొంటున్నామని వివరించారు. ఈ సంవత్సరం చివరిలోగా దేశవ్యాప్తంగా లక్షా 50 వేల వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని వెల్లడించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి సభలో అర్థవంతమైన చర్చ జరగాలని, సభ్యులందరికీ సమాన అవకాశాలివ్వాలని లోక్సభ స్పీకర్ను టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు కోరారు. సభను నిర్వహించే క్రమంలో తండ్రి తన పిల్లలను ఎలా సమదృష్టితో చూస్తారో, విద్యార్థులతో ఉపాధ్యాయుడు ఎలా వ్యవహరిస్తారో అలా స్పీకర్ వ్యవహరించాలని పేర్కొన్నారు.