MP Kotha Prabhaker Reddy | దుబ్బాక : “రాజకీయ కక్షసాధింపు కోసమే..కేంద్రంలో ఉన్నా బీజేపీ తమ ఇంటిపై ఐటీ సోదాలు చేయించింది. ఆ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, తాను పూర్తిగా వైట్ పేపర్ అని” మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు.
బుధవారం హైదరాబాద్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి ఐటీ అధికారులు ఫోన్ ద్వారా హైదరాబాద్లో తన ఇంట్లో సోదాలు చేసేందుకు సెర్చ్ వారెంట్తో వచ్చామని చెప్పినట్లు తెలిపారు. ఈ విషయంపై టీవీ చానళ్లలో వచ్చిన వార్తలపై ఎంపీ స్పందించారు.
తాను హైదరాబాద్లో లేకున్నప్పటికీ ఐటీ అధికారులకు మా కుటుంబీకులు పూర్తిగా సహకరించారని తెలిపారు. సెర్చ్ వారెంట్తో మా ఇంటికి వచ్చిన ఐటీశాఖ అధికారులు ఇంటిని సెర్చ్ చేసుకుని వెళ్లాలన్నారు. ‘నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కొత్త ప్రభాకర్రెడ్డి ఈజ్ ఫ్యూర్ వైట్ పేపర్ అని ఆయన స్పష్టం చేశారు. 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచే పాన్కార్డు తీసుకున్నానని, నాటి నుంచి నేటి వరకు మా వ్యాపారం పూర్తిగా వైటే అని తెలిపారు. హైదరాబాద్లోని ఇంట్లో ఉన్న తన కూతురు ఐటీ అధికారులకు సెర్చ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చిందన్నారు.
అయితే అక్కడ ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదన్నారు. తనతో ఐటీ అధికారులు ఫోన్లో మాట్లాడింది వేరొకటైతే …టీవీ చానళ్లలో వస్తుంది మరొకటిగా ఉందన్నారు. మా ఇంటికి ఐటీ అధికారులు ఎందుకొచ్చారో వారికే తెలియడం లేదన్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నాయకులపై బురద జల్లి, బదనాం చేసేందుకే ఐటీ సోదాలు చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
మా ట్రాన్సుపోర్టు వ్యాపారంలోని లావాదేవీలు పూర్తిగా వైట్ బిజినెస్ అని ఎంపీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో అవినీతి, ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదన్నారు. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. నా సొంత వ్యాపారంలో కానీ, ప్రభుత్వపరంగా కానీ ఎక్కడ కూడా తప్పు చేసే ఆస్కారం లేదన్నారు. జీఎస్టీ, సీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్.. ఎందులో చూసినా మేము పూర్తి పారదర్శకతతో ఉన్నామన్నారు. కొత్త ప్రభాకర్రెడ్డి ఏదో అవినీతికి పాల్పిడినట్లు ఐటీ దాడులు అంటూ టీవీ చానళ్లలో ఫ్లాష్.. ప్లాష్ న్యూస్ రావడం విడ్డూరంగా ఉందన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు.. ఈ రోజు మా ఇంటికి వచ్చిన ఐటీ అధికారుల తీరు ఉందన్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టేందుకో.. లేక బ్లాక్ మనీ చేసుకునే దౌర్భగ్య పరిస్థితి తమకు లేదన్నారు. మాకు అక్రమ వ్యాపారాలు లేవని చేసేది ఒకేఒక వ్యాపారం ట్రాన్సుపోర్టు వ్యాపారమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు.