హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల పెల్లుబికుతున్న విశ్వాసం, ఆదరణతో బీఆర్ఎస్ పార్టీ దినదిన ప్రవర్ధమానమవుతూ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో అనేకమంది ప్రముఖ నాయకులు బీఆర్ఎస్లో చేరి, పార్టీని బలోపేతం చేస్తుండగా.. తాజాగా మధ్యప్రదేశ్ నుంచి కూడా ప్రముఖుల చేరికలు జోరందుకుంటున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మంగళవారం మధ్యప్రదేశ్లోని రేవా నియోజకవర్గానికి చెందిన బీజేపీ మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్తోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. బీఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నరేశ్సింగ్ గుర్జార్, సమాజ్వాదీ పార్టీకి చెందిన సాత్నా మాజీ ఎమ్మెల్యే ధీరేంద్రసింగ్, సాత్నా జిల్లా పంచాయత్ సభ్యులు విమల బాగ్రి, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్యాదవ్, భోపాల్కు చెందిన రాకేశ్ మాల్వీయ, సత్యేంద్రసింగ్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మాడల్ కోసం ఎదురుచూస్తున్నాం: ఎంపీ బుద్ధసేన్ పటేల్
మధ్యప్రదేశ్ బీఆర్ఎస్ రాష్ట్ర కో ఆర్డినేటర్గా మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ను పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నియమించారు. తాము మధ్యప్రదేశ్కు తిరిగివెళ్లిన తర్వాత ఇప్పటికే ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రజలు, నేతలతో సమావేశమై విస్తృతంగా చర్చించనున్నట్టు బుద్ధసేన్ పటేల్ పేర్కొన్నారు. తెలంగాణ మాడల్ పాలన కోసం మధ్యప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని, త్వరలో మధ్యప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. త్వరలోనే భారీ సంఖ్యలో నేతలు హైదరాబాద్కు తరలివచ్చి బీఆర్ఎస్లో చేరతారని చెప్పారు. చేరికల అనంతరం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో బహిరంగసభ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆ సభకు పార్టీ అధినేత కేసీఆర్ను బుద్ధసేన్ పటేల్ ఆహ్వానించారు.