ఖలీల్వాడి, నవంబర్ 20: బీజేపీ ఎంపీ అర్వింద్ ‘పొలిటీషియన్ కాదు పొల్యూషన్’ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ది ఫైటర్స్ ఫ్యామిలీ అని, అర్వింద్ది చీటర్స్ ఫ్యామిలీ అని ధ్వజమెత్తారు. ఎంపీ అర్వింద్కు సంస్కారం లేదని దుయ్యబట్టారు. నిజామాబాద్లోని తెలంగాణభవన్లో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అర్వింద్ అడ్డగోలు చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్టుడని నిప్పులు చెరిగారు.
ధర్మపురి కుటుంబమే ఒక అవినీతి కూపమని ఆరోపించారు. వాళ్లు ధరించే దుస్తులు, తినే తిండి కేసీఆర్ పెట్టిన భిక్ష అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై అడ్డూ అదుపులేకుండా మాట్లాడుతున్న అర్వింద్కు.. వారిని నేరుగా ఎదుర్కొనే దమ్ములేకే బూతు పురాణానికి దిగుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఎప్పు డు, ఎక్కడ మల్లికార్జున కార్గేను కలిశారో నిరూపించాలని డిమాండ్ చేశారు. అర్వింద్ తప్పుడు మాటలకు చెప్పులతో కొట్టడం చిన్నమాట అని, కవిత వ్యక్తిత్వం ఉన్న ఆడబిడ్డ కాబట్టి చెప్పుతో సరిపెట్టారని పేర్కొన్నారు. తామైతే ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో బట్టలూడదీసి ఉరికిచ్చి కొడుతామని హెచ్చరించారు. అర్వింద్ ఎంపీగా ఈ నాలుగేండ్లలో ఏం చేశారో? ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తేలేని ఎంపీ.. రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి.
రాష్ట్రంలో కులాల మధ్య కుంపటి రగిలించేందుకు కుట్ర చేస్తున్నారని, రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చారని దుయ్యబట్టారు. కవిత ఇంటిపై బీజేపీ అరాచక మూకలు దాడి చేశాయని, గత జూలైలో వరంగల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిపై బీజేపీ గూండాలు రాళ్లతో దాడి చేశారని, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ రౌడీ మూకలు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై రాళ్లు, కత్తులతో దాడి చేసి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని కొట్టి గాయాల పాలు చేశారన్నారు. ఈ ఘటనలపై గవర్నర్ నివేదికలు ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. బీజేపీకి ఒక న్యాయం, టీఆర్ఎస్కో మరో న్యాయమా అని ప్రశ్నించారు.