హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ స్కీంను ప్రవేశ పెట్టాలన్న ప్రధాన డిమాండ్తో అక్టోబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ తెలిపారు. ఎన్ఎంవోపీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం ఢిల్లీలోని ఎన్డీ తివారి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీపీఎస్ రద్దుకు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయడంపై సమగ్రంగా చర్చించారు.
ఏప్రిల్ 16న పెన్షన్ రాజ్యాంగ మార్చ్ను నిర్వహించాలని, జూన్ 1నుంచి పాత పెన్షన్ కోసం క్విట్ ఇండియా రథయాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 1 నుంచి 9 వరకు పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం ఘంటి బజావో – పెన్షన్ దిలావో పేరుతో ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసే కార్యక్రమాల అనంతరం అక్టోబర్ 1న రాంలీలా మైదానంలో పెన్షన్ శంఖానాథ్ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విజయ్కుమార్ బందు, సుబ్జిత్ సింగ్, దారివాల్, వితేశ్ కండెలర్, పరమానంద దహేరియా, అమ్రిక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.