హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కాబ్ ఇంటర్నేషనల్ మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ డీ రాజిరెడ్డి అన్నారు. సోమవారం వర్సిటీ పరిపాలన భవనంలో రెండు సంస్థల అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉండటం వల్ల ఏ సమయంలోనైనా ఆయా కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం ఉన్నదని, ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలని విద్యార్థులకు వీసీ సూచించారు.
ఈ అవగాహన ఒప్పందంతో రెండు పక్షాల మధ్య పలు అంశాల్లో అవగాహన మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చీడ, పీడల యాజమాన్యం, నేల సారవంతం, విత్తనాలు, బిజినెస్, డిజిటల్ ఫార్మింగ్ వంటి అంశాలపై ఆన్లైన్ కోర్సులు ఉన్నాయని క్యాబ్ ఇంటర్నేషనల్ గ్లోబల్ టీం లీడర్ మాళవిక చౌదరి పేర్కొన్నారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, పరిశోధన సంచాలకులు లక్ష్మీ నారాయణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీనివాసన్, సీఏబీఐ సౌత్ ఆసియా అగ్రికల్చర్ డిజిటల్ టూల్స్ కో-ఆర్డినేటర్ మాధురి మంజరి, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ సెల్ డైరెక్టర్ అనిత కుమారి, బోర్డు మెంబర్ ప్రశాంత్, కన్సల్టెంట్ వీరాంజనేయులు పాల్గొన్నారు.