హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ప్రజలకు సేవ చేసేందుకు తన తల్లే స్ఫూర్తి అని సినీనటుడు సోనూసూద్ పేర్కొన్నారు. ఆమె ప్రేరణతోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. సేవా కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన సోనూసూద్ మంగళవారం ప్రగతిభవన్లో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశం నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సహా యం చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కరోనా సంక్షోభకాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగతస్థాయిలో ఇంత భారీఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి మంత్రికి వివరించారు. హైదరాబాద్, ఇక్కడి స్థానికులపై తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉన్నదని పేర్కొన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకు ప్రపంచస్థాయి కంపెనీలు రావడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. అనంతరం మంత్రి కేటీఆర్, సోనూసూద్ కలిసి భోజనం చేశారు. సేవా కార్యక్రమాలను అభినందిస్తూ సోనూసూద్ను మంత్రి కేటీఆర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ తదితరులు పాల్గొన్నారు.