గుడిహత్నూర్, ఆగస్టు 6: క్షణికావేశంలో తల్లీకొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ధంపూర్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన రత్నం దేవీదాస్, రాధ(46) దంపతులు. వీరికి కొడుకు హరీశ్(23) ఉన్నాడు. అనారోగ్యం కారణంగా దేవీదాస్ ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లీకొడుకు కలిసి ఏడు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పత్తి, సోయా పంట సరిగా మొలకెత్తలేదు. ఈ విషయమై శుక్రవారం తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. హరీశ్ క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి రోడ్డు పైకి వచ్చి వాంతులు చేసుకొన్నాడు. గమనించిన గ్రామస్థులు వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తీసుకెళ్లారు. కొడుకు పురుగుల మందు తాగడంతో ఆవేదన చెందిన రాధ కూడా తాగింది. చుట్టు పక్కల వారు ఈమెను కూడా రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.