హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై త్వరగా తేల్చాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు రాజ్భవన్లో పెండింగ్ ఉన్నదని, నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆమోదముద్ర వేయాలని కోరారు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య పద్దులపై మంత్రి మాట్లాడారు. నాణ్యమైన విద్య అందినపుడే మానవవనరులు అభివృద్ధి చెందుతాయని, దీన్ని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యనందిస్తున్నట్టు చెప్పారు. ‘మన ఊరు-మనబడి’ రెండోవిడతలో 9,123 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.2,516 కోట్లతో పనులు చేపడుతామని పేర్కొంటూ అద్భుతంగా తీర్చిదిద్దిన పలు పాఠశాలల ఫొటోలను మంత్రి సభలో ప్రదర్శించారు. ఏటా 2.10 కోట్ల ఉచిత పుస్తకాలు అందజేస్తున్నామని ఆమె వివరించారు.
కేంద్రం వాటా రూ.228 కోట్లే
మధ్యాహ్న భోజన పథకంలో కేంద్ర వాటా రూ.228 కోట్లేనని మంత్రి స్పష్టం చేశారు. 1-8 తరగతులకు రూ.376 కోట్లు, రూ.119 కోట్లు కోడిగుడ్లకు, రూ.240 కోట్లు సన్నబియ్యానికి, రూ.158 కోట్లు 9,10 తరగతుల్లోని విద్యార్థులకు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాల పెంపునకు రూ.130 కోట్లు.. మొత్తం రూ.1,024 కోట్లు ఖర్చు చేస్తుంటే దీంట్లో కేంద్రం వాటా రూ.228 కోట్లు మాత్రమేనని వివరించారు. రాష్ట్రంలో కేజీబీవీలు 475 ఉండగా 245 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశామని, అన్నింటిని అప్గ్రేడ్ చేయాలంటే కేంద్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భవానికి ముందు గురుకులాల బడ్జెట్ రూ.740 కోట్లు ఉంటే, ఈ ఏడాది రూ.3,400 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఇటీవల 14 పాలిటెక్నిక్ కాలేజీలు మంజూరు చేశామని, బాసర ఆర్జీయూకేటీలో మౌలిక వసతుల కల్పనకు రూ.50 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. జేఎన్టీయూ సుల్తాన్పూర్ క్యాంపస్ను ఫార్మా వర్సిటీగా మార్చుతామని, మహబూబాబాద్, కొత్తగూడెంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.