హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి పథకంలో సింహభాగం పనులను టెండర్లు లేకుండానే చేపట్టనున్నారు. అంచనా వ్యయం రూ.30 లక్షలలోపు ఉండే పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించనున్నారు. అంతకు మించిన పనులను మాత్రమే టెండర్ల ద్వారా అప్పగిస్తామని అధికారులు చెప్తున్నారు. నామినేషన్ పద్ధతిలోని చేపట్టే పనులకు గుత్తేదారులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లు ఎంపికచేస్తాయి. ఈ లెక్కన ఈ పథకంలోని 12 అంశాల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మాత్రమే టెండర్లను ఆహ్వానించే అవకాశాలున్నాయి. రాష్ట్రస్థాయిలో బల్క్గా సేకరించే సామాగ్రిని సైతం టెండర్ల ద్వారానే సమీకరించనున్నారు. రూ.30 లక్షలలోపు విలువైన పనుల అంచనాలను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. రూ.30-50 లక్షల అంచనాలను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, రూ.50 లక్షల నుంచి రూ. 2 కోట్ల అంచనాలను సూపరింటెండెంట్ ఇంజినీర్లు, రూ.2 కోట్లకు మించిన అంచనాలకు చీఫ్ ఇంజినీర్లు ఆమోదించి టెక్నికల్ అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు పరిపాలన అనుమతులిస్తారు.
టెండర్లు అవసరంలేనివి
చిన్న, భారీ మరమ్మతులు, విద్యుత్ కనెక్షన్లు, తాగునీటి వసతి, టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడల నిర్మాణ పనులను టెండర్లు లేకుండానే నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తారు.
టెండర్లు పిలిచేవి
డ్యూయల్ డెస్క్ బల్లలు, డిజిటల్/స్మార్ట్ క్లాస్రూం పరికరాలు, పెయింట్స్, గ్రీన్ చాక్పీస్ బోర్డులు, హెచ్ఎం, స్టాఫ్రూం ఫర్నీచర్, లైబ్రరీ, కంప్యూటర్, సైన్స్ల్యాబ్ల ఫర్నిచర్ను టెండర్ల ద్వారా సమీకరిస్తారు. రూ.30 లక్షలకు మించిన అంచనా వ్యయంతో చేపట్టే అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను కూడా టెండర్ల ద్వారానే కేటాయిస్తారు.