హైదరాబాద్, మే24 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల దరఖాస్తు గడువు బుధవారం సాయంత్రం ముగిసింది. చివరిరోజు నాటికి మొత్తం 65 వేలకుపైగా దరఖాస్తులు నమోదైనట్టు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో 1,276 పీజీటీ, లైబ్రేరియన్ 434, ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు నమోదయ్యాయి. ఇదిలావుండగా, గురుకులాల్లోని 9,231 పోస్టులకు ఇప్పటివరకు మొత్తం 2.18లక్షలకు పైగా దరఖాస్తులొచ్చినట్టు ట్రిబ్ అధికారులు వెల్లడించారు. ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.