హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు కనీస మొత్తంకూడా కూలీగా అందటంలేదు. జాతీయ సగటులో కంటే కూలీ రేటు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తక్కువగా నిర్ణయించడంతో ఇక్కడి కూలీలు తక్కువ మొత్తం కూలీని పొందుతున్నారు. కనీస వేతనాలను పరిగణనలోకి తీసుకోకుండా కూలీ మొత్తాన్ని నిర్ణయించడంతో తెలంగాణకు చెందిన కూలీలు అతి తక్కువగా కూలీ మొత్తాన్ని పొందుతున్నారు. ఉపాధి హామీలో ఎక్కువ శాతం మహిళలే కూలీకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు ఎక్కువగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో 52.78 లక్షల జాబ్కార్డులు ఉన్నాయి. 2022-23లో 12.16 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. లిబ్ టెక్ స్వచ్ఛంద సంస్థ ఉపాధి హామీపై విశ్లేషణ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఉపాధి హామీ పనులకు ఎక్కువగా మహిళలు వస్తున్నారని వెల్లడైంది. గత ఆర్థిక సంవత్సరంలో 61 శాతం మహిళలు ఉపాధి హామీ పనిచేసినట్టు నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ కూలీల పనిదినాలు తగ్గినట్టు ఆ నివేదిక అంచనావేసింది. సగటు వేతనం పొందడంలో తెలంగాణ చాలా వెనకబడి ఉన్నట్టు గుర్తించారు. జాతీయ సగటు కూలీ రూ.217.91 పొందుతుండగా తెలంగాణలో సగటు కూలీ కేవలం రూ.164.34 మాత్రమే అందుకుంటున్నారని నివేదికలో పేర్కొన్నారు. మన రాష్ట్రం కూలీ రూపంలో రూ.2033 కోట్లను పొందింది. ఉపాధి హామీ పథకానికి కేంద్రం విధించిన షరతులు, తనిఖీలు, నిబంధనలు కూలీల పొట్టకొట్టే విధంగా ఉన్నట్టు నివేదికలో మరోసారి స్పష్టమైంది. వంద రోజుల పనిదినాలు పూర్తిచేసిన వారు కేవలం 0.9 శాతం ఉన్నట్టు నివేదిక పేర్కొంది. గతంలో వీరు మూడు శాతానికి పైగా ఉండేవారు.
ఉపాధి హామీ పనులకు మహిళలే ఎక్కువ వస్తున్నట్టు గత కొన్ని సంవత్సరాల పనిదినాలను పరిశీలిస్తే స్పష్టం అవుతున్నది. గత మూడేండ్లలో మహిళల సంఖ్య రెండు శాతానికి పైగా పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పురుషులు వ్యవసాయ పనులు, వ్యవసాయేతర పనులు చేయడానికి వెళ్తుండగా మహిళలు ఉపాధి హామీ పనులకు మొగ్గు చూపుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఉపాధి హామీ పని దినాలు అత్యధికంగా (75 శాతం) ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే పూర్తవుతున్నాయి. గతంలో వేసవి కాలంలో భూమి గట్టిగా ఉంటుందని అదనపు కూలీని ఇచ్చే వారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన తాజా నిబంధనలతో ఆ అదనపు మొత్తాన్ని ఇవ్వడంలేదు. దీనితో పాటుగా కూలీలకు పని ప్రదేశాల్లో టెంటు, తాగునీరు, మెడికల్ కిట్, గడ్డపార, పార కేంద్రం ఇవ్వాల్సి ఉండగా ఇవేవీ అందించడం లేదు. ఈ పరికరాలను కూలీలే సమకూర్చుకుంటున్నారు. నిరుడు కేంద్రం 10 కోట్ల పనిదినాలను కేటాయించగా ఈ ఏడాది ఏడు కోట్ల పనిదినాలను మాత్రమే కేటాయించింది.