హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) యాప్లో మరిన్ని భాషలను చేర్చాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికులు ఎదురొంటున్న సమస్యలపై మంగళవారం ఆయన లోక్సభలో కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ ఎన్ఎంఎంఎస్ యాప్లో 5 భాషలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీ కార్మికుల్లో చాలా మందికి వారి మాతృభాష తప్ప వేరే భాష చదవడం రాదని పేర్కొంటూ.. వారు ఎదురొంటున్న సమస్యల గురించి మోదీ సర్కార్కు తెలియదా? అని ప్రశ్నించారు. గుర్తింపు పొందిన ఇతర భాషలను ఎన్ఎంఎంఎస్ యాప్లో చేర్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలేమిటో చెప్పాలని కోరారు. దీనిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి స్పందిస్తూ.. ప్రస్తుతం ఎన్ఎంఎంఎస్ యాప్లో ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషలు అందుబాటులో ఉన్నాయని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భాష కారణంగా ఎన్ఎంఎంఎస్ యాప్ ను ఉపయోగించకపోవడానికి నిర్దిష్టమైన సమస్యలేవీ గుర్తించలేదన్నారు. పని ప్రదేశంలో ఉపాధి హామీ కార్మికుల హాజరును తీసుకోవాల్సిందిగా మే ట్లకు సూచించామని, ఈ యాప్లో సాంకేతిక సమస్యలేమైనా ఉంటే రియల్ టైమ్ ప్రాతిపదికన ఎన్ఐసీ పరిష్కరిస్తుందని తెలిపారు.
రాష్ర్టానికి 142 ఎఫ్పీవోలు
తెలంగాణ నుంచి 142 ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్(ఎఫ్పీవో) మంజూరైనట్టు కేంద్రప్రభుత్వం తెలిపింది. మంగళవారం ఎంపీ రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఇప్పటివరకు తెలంగాణలో 32 జిల్లాల్లో 142 ఎఫ్పీవోల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్లు పూర్తైనట్టు వివరించింది. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 14, కరీంనగర్ జిల్లా లో 12, మెదక్ జిల్లాలో 11, నిజామాబాద్ జిల్లాలో 10 ఎఫ్పీవోల చొప్పున మంజూరైనట్టు వెల్లడించింది. ఈ ఎఫ్పీవోలకు రూ. 45.87 లక్షల ఈక్విటీ నిధులు మంజూరైనట్టు తెలిపింది.