హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ స్వాములు జరిపిన బేరసారాల వెనుక ఢిల్లీ పెద్దలు చాలామంది ఉన్నట్టు తెలుస్తున్నది. వారికి సంబంధించిన వీడియాలు, ఆడియోలు త్వరలోనే బయటకు వస్తాయని సమాచారం. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ అనైతిక కొనుగోళ్ల వెనుక పదుల సంఖ్యలో ఢిల్లీ స్థాయి బీజేపీ నేతలు ఉన్నట్టు చెప్తున్నారు. ఎవరెవరు ఏం మాట్లాడారు, ఎంత ఆఫర్ ఇచ్చారనే విషయాలు ఆ టేపుల్లో స్పష్టంగా ఉన్నట్టు సమాచారం. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకత్వంలో నిర్ణాయక పాత్ర పోషించే నేతలు కూడా ఆ టేపుల్లో ఉన్నట్టు చెప్తున్నారు. ఈ టేపులపై ఫోరెన్సిక్ విభాగం ఇచ్చే నివేదికల ఆధారంగా పోలీసులు వారిపై గురిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ దూతలతోపాటు వారిని వెనుక నుంచి నడిపిస్తున్న నాయకగణం కూడా కటకటాల వెనుకకు పోవాల్సిందేనని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. పోలీసుల వద్ద ఉన్న టేపుల సమాచారంపై బీజేపీ కేంద్ర నాయకత్వంలో ఇప్పటికే ప్రకంపనలు మొదలైనట్టు తెలుస్తున్నది. బయటకు వచ్చిన ఒకటి రెండు ఆడియో టేపులతోనే బీజేపీ రాష్ట్ర నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతూ.. మైండ్ బ్లాక్ అయినట్టు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. పోలీసుల వద్ద ఉన్న ఆధారాలన్నీ బయటకు వస్తే వారి పరిస్థితి ఏమిటి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. ఇప్పటికే అన్ని వైపులా ఉచ్చు బిగుస్తుండటంతో కొందరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండగా, మరికొందరు తేలు కుట్టిన దొంగల్లా పక్కకు తప్పుకొంటున్నారు.
ఢిల్లీ పెద్దల పాత్రపై ఆధారాలు
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడం ద్వారా ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న బీజేపీ కుయుక్తులను, పార్టీకి.. పార్టీ అధినేతకు విశ్వాసపాత్రులైన శాసనసభ్యులు తిప్పికొట్టారు. బీజేపీ పెద్దల కుట్రలను ముందుగానే పసిగట్టి.. వారు చేస్తున్న, చేయిస్తున్న అనైతిక పనులకు సంబంధించిన ఆధారాలను తెలివిగా కూడగట్టారు. వారి ఉచ్చులో పడినట్టు నమ్మిస్తూనే తమ ముగ్గులోకి వారిని లాక్కొచ్చారు. అందులో భాగంగానే ఢిల్లీ బీజేపీ పెద్దల దూతలుగా వచ్చిన స్వామీజీలు రామచంద్రభారతి, సింహయాజి, వ్యాపారి నందకుమార్లను పోలీసులకు పట్టించారు. ప్రస్తుతం వైరల్ అయిన ఒక ఆడియో టేపు ప్రకారం.. సెప్టెంబర్ 26న రామచంద్ర భారతి బృందం ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డిని సంప్రదించింది. టీఆర్ఎస్ నుంచి ఫిరాయించి బీజేపీలోకి రావాలని ఆహ్వానించింది. ఇందుకు ఆయనకు రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టులు ఇప్పిస్తామని, కేంద్రంలో పదవి కూడా ఇస్తామని ఆశ చూపింది. తాము చెప్పినట్టు చేయకపోతే ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తామని హెచ్చరించింది.
ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, రామచంద్రభారతి, సింహయాజి మధ్యవర్తి నందకుమార్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన అడియోలు శుక్రవారం బయటకు వచ్చాయి. ఇవే కాకుండా మరిన్ని వీడియో లేదా ఆడియోలు బయటకు వచ్చే అవకాశమున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఆడియోలలో కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు, వారి కార్యదర్శులు జరిపిన సంభాషణలు ఉన్నట్టు చెప్తున్నారు. ఢిల్లీ పెద్దలు స్వయంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. ‘మరింత మంది ఎమ్మెల్యేలను మీ వెంట తీసుకురావాలి, అందుకు ప్రతిఫలం పక్కాగా ఉంటుంది. ఇటీవల బీజేపీలో చేరిన వారిని ఎలా చూసుకున్నామో వారినే అడగండి. ఇటీవల బీజేపీలో చేరిన ఓ మాజీ పార్లమెంట్ సభ్యుడిని అడగండి’ అంటూ ప్రలోభపెట్టడం ఆడియోలో వినిపిస్తున్నది. మధ్యవర్తుల ద్వారా డీల్ అంతా పూర్తి చేసుకొని వస్తే స్వయంగా తామే రంగంలోకి దిగుతామని కొందరు పెద్దలు మాట కూడా ఇచ్చారు.
తేనె తుట్టె కదిలించారు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్వామీజీల సాయంతో పార్టీ ఫిరాయింపులకు బీజేపీ ప్రోత్సహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సస్యశ్యామలంగా, పటిష్ఠమైన శాంతిభద్రతలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నదని రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని మోసపూరితంగా అడ్డుకొనేందుకు జరిపిన కుట్రను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకొన్నారు. మోసాన్ని మోసంతోనే జయించాలని స్వామీజీలతో తాము జరిపిన సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేశారు.మధ్యవర్తులుగా వచ్చిన స్వామీజీలు ఎమ్మెల్యేలతో మాట్లాడటంతోపాటు తమను పంపిన ఢిల్లీ పెద్దలతోనూ మాట్లాడించారు. ఇవన్నీ ఆడియోలలో రికార్డయ్యాయి. టీఆర్ఎస్ తేనెతుట్టెను బీజేపీ కదిలించి ఘోర తప్పిదానికి పాల్పడిందని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఫోరెన్సిక్కు ఆడియో టేపులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ, వారికి లంచాలు ఇవ్వజూపుతూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ స్వామీజీలు.. వారు కేంద్ర పెద్దలతో మాట్లాడించినట్టు చెప్తున్న ఆడియోలు, వీడియోలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపుతున్నారు. ఇప్పటికే కొన్ని టేపులు అనధికారికంగా లీక్ కావడం వాటిలో స్వామీజీలు జరిపిన సంభాషణలు బయటకు రావడంతో మొత్తానికి బీజేపీ బండారం బట్టబయలైంది. మొత్తం ఆడియో, వీడియోలపై ఫోరెన్సిక్ విభాగం ఇచ్చే నివేదిక ఆధారంగా.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై పోలీసులు దృష్టి సారించనున్నారు.