Moranchapalli | రెండు మూడురోజులుగా కురుస్తున్న జడివానకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రామ శివారులో ఉన్న వాగులోకి భారీగా వాన నీరు చేరడంతో గ్రామంలోకి వరద ముంచెత్తింది. తెల్లవారుజామున గ్రామస్తులు నిద్ర లేచేవరకే వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో జనం ఏం చేయాలో తెలియక చెట్లు, ఇంటి మిద్దెపైకి ఎక్కారు. సమాచారం అందుకున్న అధికారులు గ్రామస్తులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గ్రామానికి చేరుకొని దాదాపు 200 మంది వరకు ప్రజలను సురక్షితంగా కాపాడారు. ముంపు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి బోట్ల ద్వారా తరలించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ ఆద్వర్యంలో రెండు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఊరి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రానికితరలించాయి. ఫైర్ డీజీ ఆదేశాల మేరకు విపత్తు ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఫైర్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలో పాల్గొని ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైదరాబాద్ నుంచి బోట్లను, ఇతర సహాయక సామగ్రిని ఫైర్ డిపార్ట్మెంట్ వరద ప్రాంతాలకు తరలించినట్లు ఫైర్ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు.
వరదలో ఇంకెవరైనా చిక్కుకున్నారేమోననని సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మోరంచపల్లిలో రెండు ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో సీఎస్ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ వినియోగించడం కష్టంగా మారడంతో సైన్యంతో చర్చలు జరిపారు. సైన్యం అంగీకారం తెలపడంతో ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లను ప్రభుత్వం మోరంచపల్లి గ్రామానికి పంపి.. సహాయక చర్యలు చేపట్టింది.