హైదరాబాద్ సిటీబ్యూరో/మలక్పేట, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టాలెక్కిన మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి ఎట్టకేలకు అందుబాటులోకి వస్తున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సుదూర ఆలోచనతో, వ్యూహాత్మక ప్రణాళికతో రూపకల్పన చేసిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సీఎం రేవంత్రెడ్డి సోమవారం ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేయనున్నారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం రూ.52 కోట్లతో మూసీ నదిపై నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు 2023లో అప్పటి మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దాదాపు సగం పనులు బీఆర్ఎస్ హయాంలో పూర్తయ్యాయి. మిగిలిన పనులను ఏడాదిన్నరలోగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాల్సిన కాంగ్రెస్ సర్కార్ తీవ్ర జాప్యం చేసింది. దీంతో రెండున్నరేండ్లుగా స్థానిక ప్రజలు కిలోమీటర్ల కొద్దీ చుట్టూ తిరిగి నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ బ్రిడ్జి అందుబాటులోకి రానుండడంతో అంబర్పేట-మలక్పేట మధ్య ప్రయాణకష్టాలు తొలగి రాకపోకలు సులభతరం కానున్నాయి.