హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): దాదాపు 12 దేశాల్లో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను (డీఎంహెచ్వో) అప్రమత్తం చేస్తూ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు. మంకీపాక్స్ లక్షణాలు, బాధితుల గుర్తింపు, చికిత్సపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అన్ని దవాఖానల్లో చికిత్సకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
మంకీ పాక్స్ లక్షణాలు: జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం.
అనుమానితులు ఎవరంటే..?: అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు.
చికిత్స: అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే దవాఖానలో చేర్చి ఐసొలేషన్లో ఉంచాలి. చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్స అందించాలి. ఇతరులకు సోకకుండా అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
మంకీపాక్స్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఎన్సీడీసీ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. లక్షణాలు 2-4 వారాల్లో తగ్గిపోతాయని తెలిపింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే తీవ్రత పెరుగుతుందని చెప్పింది. మరణాల రేటు 1-10 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.