Telangana | కొడకండ్ల, నవంబర్ 14: ‘కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆశ పడ్డం.. ఇప్పుడు గోస పడుతున్నం’ అంటూ రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి వెళ్తుండగా ఎర్రబెల్లి వాహనాన్ని ఆపి ఆయనతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము పండించిన పంటకు బోనస్ ఇవ్వకపోగా, కనీసం మద్దతు ధర కూడా ఇస్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రైతుబంధు, రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు.. బోనస్ ఎప్పుడిస్తరో తెల్వదు.. అసలు వడ్లే సరిగా కొంటలేరు.. అందుకే మేము ప్రైవేట్ల అమ్ముకుంటున్నం’ అని రైతులు వాపోయారు.
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెల రోజులైనా ధాన్యం కొంటలేరని, అందుకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో తడిసిన గింజలను కూడా కొనుగోలు చేసి టైముకు పైసలు ఇచ్చేటోళ్లని, మొదట్లనే రైతుబంధు వేస్తే మా జేబులల్ల పైసలు ఉండేవని చెప్పుకొచ్చారు. అప్పటి రోజులే మంచిగుండెనని, తాము ఇంకా ఏదో ఆశకు పోయి ఇప్పుడు గోస పడుతున్నామని అనుముల అంజయ్య, పెరుమాండ్ల పరశురాములు, నలమాస మల్లయ్య, తదితర రైతులు ఎర్రబెల్లికి తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమని, ప్రతి గింజా కొనేవరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
నాకున్న సొంత పొలంతోపాటు మరికొంత కౌలుకు తీసుకుని 8 ఎకరాల్లో వరి పండించిన. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తదనుకున్నం కానీ, కొనకపాయే. వడ్లు ఆరబోసి ఇరవై రోజులైనా మాయిశ్చర్ వస్తలేదు, సరిగా ఎండలేదు అని చెప్తే 100 బస్తాలకు పైగా ప్రైవేట్ల అమ్ముకొచ్చినం. ఇంకా 150 బస్తాలకు పైగా ఇయ్యాల ప్రైవేట్కు పోతున్నం. బోనస్ వస్తది అంటే సన్న వడ్లు కూడా ఏసినం. అవికూడా ఇప్పుడు ప్రైవేట్కు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మద్దతు ధర దక్కక, బోనస్ లేక ఇబ్బంది పడుతున్నం. రైతుబంధు లేదు.. ఏం లేదు.. అంతా ఉట్టిదే.
– అనుముల అంజయ్య, రైతు, మొండ్రాయి