హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్తోపాటు మరో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్కు పదవీ గండం సమీపిస్తున్నది. వీరిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ రేవంత్రెడ్డి ప్రభుత్వం చేసిన సిఫారసును గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా ఇప్పటికీ ఆమోదించలేదు. దీంతో వారికి 9 రోజులు మాత్రమే గడువు ఉన్నది. ప్రభుత్వ సిఫారసును ఈ నెల 31లోగా గవర్నర్ ఆమోదించకపోతే అజారుద్దీన్, కోదండరామ్ పదవులు ఊడటం ఖాయమని స్పష్టమవుతున్నది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగడంతో.. కాంగ్రెస్ సర్కార్ సిఫారసుపై గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇవ్వాలని అటార్నీ జనరల్ వెంకటరమణి కోరారు. అజారుద్దీన్ మంత్రి పదవి చేపట్టి ఈ నెల 31తో ఆరు నెలలు అవుతుందని, దీంతో చట్టసభ సభ్యుడిగా ఆయనకున్న గడువు ముగిసిపోనున్నందున కొత్త గవర్నర్ సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని విన్నవించారు. గవర్నర్ నిర్ణయం వెలువడ్డాక తదనుగుణంగా ఈ అంశంపై విచారణ కొనసాగించాలా లేక ముగించాలా అనే దానిపై కోర్టు నిర్ణయం తీసుకోవచ్చని జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనానికి తెలిపారు. దీంతో ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది.