రంగారెడ్డి, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణకు ఏమి చేశారో చెప్తే బాగుండేదని, కానీ తెలంగాణపై విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లాకు ఇస్తామన్న ఐటీఐఆర్ ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను మోదీ విస్మరించారన్నారు.
దేశవ్యాప్తంగా అనేక విద్యాలయాలు ఏర్పాటు చేసిన కేంద్రం.. తెలంగాణకు మొండి చెయ్యి చూపిందని మండిపడ్డారు. పేద, మధ్య తరగతి అమ్మాయిలకు ఉన్నత విద్యను దూరం చేసిన ఘనత మోదీ నేతృత్వంలోని కేంద్రానికే దక్కుతుందని ఎద్దేవాచేశారు. తెలంగాణలో పండిన వడ్లు కొనుగోలు చేయని ప్రధాని.. రైతులకు ఏం మేలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా నీటి వాటా తేల్చకుండా తాత్సారం చేస్తున్నది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు.