మోదీజీ.. తెలంగాణ విధానాలను అధ్యయనం చేసి అనుసరించండి
భిన్నత్వంలో ఏకత్వం, అభివృద్ధి ఎజెండాపై
చర్చకు తెలంగాణను మించిన గడ్డ లేదు
బీజేపీ విధానాల మార్పునకు ఇదే అవకాశం
కాళేశ్వరం..మిషన్ కాకతీయను చూసి నేర్వండి
మిషన్ భగీరథ స్ఫూర్తిని దేశమంతా విస్తరించాలి
మా రైతు పథకాలతో సాగుకు భరోసా ఇవ్వాలి
24 గంటల విద్యుత్తు వెలుగులను చూడండి
బస్తీకో దవాఖానతో పేదోడి చెంతకు వైద్యం
మీ ట్రబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో అమలుచేయండి
ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
కార్యవర్గ భేటీలోనైనా నిజాలు మాట్లాడండి
మీ పార్టీ డీఎన్ఏలోనే విద్వేషం, సంకుచితత్వం
దేశ ప్రజల మేలుపై చర్చిస్తారనటం అత్యాశే
అబద్ధాల పునాదులపై బీజేపీ సర్కారు పాలన
మీ పార్టీలో ఆత్మవిమర్శ చేసుకొనే ధైర్యం ఉన్నదా?
బీజేపీ విధానాలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
సంక్షేమానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా, పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధుతోపాటు 450కి పైగా సంక్షేమ పథకాలను అధ్యయనం చేసి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయండి. హైదరాబాద్ మెహమాన్ నావాజ్గీ కీ బాత్హీ కుచ్ అలగ్ హై అంటారు. అందుకే హైదరాబాద్లో ధమ్ బిర్యానీ రుచి చూడండి. శాకాహారుల కోసం వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది..అడగడం మర్చిపోకండి. ఇరానీ చాయ్ తాగుతూ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకండి. అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి. అందుకే ఆవో.. దేఖో… సీఖో అంటున్నాం.
– ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ హితవు
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు వస్తున్న బీజేపీ నాయకులకు మతాలు, ప్రాంతాల పేరిట సంకుచిత మనస్తత్వంలేని శాంతియుత తెలంగాణ తరఫున స్వాగతం పలుకుతున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. అద్భుతమైన అభివృద్ధితో ప్రపంచపటంపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్న తెలంగాణను అధ్యయనం చేసి దేశమంతా అనుసరించాలని, అందుకే ఆవో.. దేఖో.. సీఖో అంటూ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. శనివారం నుంచి హైదరాబాద్లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేషం, విభజన ఎజెండా కాకుండా అభివృద్ధిపై మాట్లాడాలని కోరారు.
పార్టీ డీఎన్ఏలోనే విద్వేషం, సంకుచితత్వం నింపుకొన్న బీజేపీ ప్రజలకు మేలు చేసే విషయాలను కార్యవర్గంలో చర్చిస్తుందనుకోవటం అత్యాశే అవుతుందని అన్నారు. ‘కులం, మతం, జాతి ఆధారంగా సమాజాన్ని ఖండఖండాలుగా విడదీసే దుర్మార్గ రాజకీయాల చుట్టూనే మీ చర్చలు సాగుతాయనడంలో నాకెలాంటి అనుమానం లేదు’ అని ధ్వజమెత్తారు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మోదీ, బీజేపీ పార్టీ సమావేశాల అసలు ఎజెండా విద్వేషం.. అసలు సిద్ధాంతం విభజనేనని అందరికీ తెలుసని స్పష్టం చేశారు. అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకొనే ధైర్యం ఉన్నదని తాను అనుకోవటం లేదని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కొలువైన బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇప్పటికీ నెలకొన్న దుర్భర పరిస్థితులే మోదీని తెలంగాణకు రప్పించి ఉంటాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో బీజేపీ సమావేశం పెట్టుకోవడం ఆశ్యర్యం కలిగించలేదని పేర్కొన్నారు. కారణాలు ఏవైనా బీజేపీ నాయకత్వం మొత్తం హైదరాబాద్లో మకాం వేస్తున్న సందర్భంలోనైనా కాసింత తెలంగాణతనాన్ని నేర్చుకోవాలని, ఇకడి గాలి గానం చేసే గంగా జమునా తెహజీబ్ను గుండెలనిండా నింపుకోవాలని మోదీకి కేటీఆర్ సలహా ఇచ్చారు.
బీజేపీ విధానాలు మార్చుకొనేందుకు ఇదే అవకాశం
‘ఇరిగేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, ఇంక్లూజివ్నెస్ వంటి వినూత్న విధానాలతో, సమ్మిళిత అభివృద్ధి నమూనాతో చరిత్ర సృష్టిస్తున్న తెలంగాణ గడ్డ మీ రాజకీయాలు, ఆలోచనలను మార్చుకొనే అవకాశం ఇస్తున్నది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. అందరినీ కలుపుకొనిపోయే భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తి, అభివృద్ధి ఎజెండాను చర్చించేందుకు తెలంగాణకు మించిన గొప్ప ప్రదేశం బీజేపీకి ఇంకొకటి లేదని చెప్పారు. ఈ గడ్డపై బీజేపీ విధానాలు, నినాదాలను మార్చుకుంటారో, లేదంటే మిమ్మల్ని మీరే మభ్య పెట్టుకుంటారో మీ ఇష్టమని తెలిపారు. అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్న మోదీకి ఆత్మవిమర్శ చేసుకొనే ధైర్యం ఉన్నదని తాను అనుకోవటం లేదని, అదే సమయంలో మోదీ అస్తవ్యస్త విధానాలు, అసమర్థ పాలనతో కలుగుతున్న దుష్పరిణామాలను అనుభవిస్తున్న దేశ పౌరుడిగా ఈ మాత్రం ఆశించడం అత్యాశ కాదనుకుంటానని పేర్కొన్నారు. దేశానికి సరికొత్త దిశను నిర్దేశిస్తున్న తెలంగాణ విజయాలను అధ్యయనం చేయడానికి రెండురోజుల సమయం బీజేపీకి సరిపోదని తెలుసని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వమే శభాష్ అని మెచ్చుకున్న తెలంగాణ విజయాలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలే స్ఫూర్తిగా నిలిచాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే ‘ఆవో..దేఖో… సీఖో’ (రండి..చూడండి..నేర్చుకోండి) అని మోదీ అండ్ టీమ్కు కేటీఆర్ సూచించారు.
తెలంగాణలో విద్యా నవోదయం
తెలంగాణకు ప్రత్యేకంగా ఒక నవోదయ పాఠశాలను కేటాయించకున్నా దాదాపు 1000 గురుకులాలు ఏర్పాటుచేసి పేద పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందిస్తూ సరస్వతీదేవి కొలువైన గడ్డ తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ సదుపాయాలు కల్పించడంతో పాటు విదేశీ విద్య కోసం సాలర్షిప్స్ ఇస్తున్న రాష్ట్రం తమదని గుర్తుచేశారు. అద్భుతమైన వ్యక్తిత్వం, సాటిలేని పోటీతత్వంతో కూడిన రేపటితరాలను తీర్చిదిద్దుతున్న తెలంగాణ విద్యావిధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు ప్రయత్నించాలని మోదీని కోరారు.
స్టార్ట్ అప్ మాది.. ప్యాక్ అప్ మీది
గత 45 ఎండ్లలో ఎన్నడూ లేని విధంగా దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగితను పట్టించుకోకుండా ‘పకోడీలు వేయడమూ ఉద్యోగమే’ అని నీతులు చెప్పే నాయకులు నిండుగా ఉన్న పార్టీ బీజేపీ అని కేటీఆర్ ఎద్దేవాచేశారు. అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాట తప్పింది మోదీయేనని విమర్శించారు. మోదీని ఉద్యోగాలివ్వాలని కోరితే, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ, ఉన్న ఉద్యోగాలతో పాటు, బలహీన, బడుగువర్గాల రిజర్వేషన్లను గండి కొడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం వైఖరికి భిన్నంగా సుమారు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమదని తెలిపారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను మార్చి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి ప్రైవేటురంగంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించిన చేతల ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదని వివరించారు. ‘యువత ఉద్యోగార్థులుగా మిగిలిపోకూడదు. పది మందికి ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ను ఏర్పాటు చేసిన వినూత్న ప్రభుత్వం మాది’ అని తెలిపారు.
యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో, వాళ్ల ఆశలకు రెకలు ఎలా తొడగాలో తెలంగాణ ప్రభుత్వం నుంచి నేర్చుకోండని మోదీకి సూచించారు. తాము స్టార్ట్ అప్ అంటుంటే, కేంద్రం మాత్రం 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపకుండా, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాలను ఊడగొడుతూ ప్యాకప్ విధానాన్ని అనుసరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఎన్నడూ లేనంతగా పెరిగిన నిరుద్యోగితను తగ్గించే యాక్షన్ప్లాన్ తెలంగాణలో ఉన్నదని, దాన్ని వెతికి దొరకపట్టుకోవాలని మోదీకి సూచించారు. సమాజాన్ని ముకలుగా చీలుస్తున్న మీరు ఒక వైపు ఉంటే, పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా దేశచరిత్రలో ఎకడా లేనివిధంగా సమ్మిళిత అభివృద్ధి నమూనాను పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ మరోవైపు ఉన్నారని చెప్పారు. ఆ ప్రయత్నాన్ని మీరిచ్చిన అవార్డుల సాక్షిగానే అధ్యయనం చేసి వెళ్లండి అని మోదీకి కేటీఆర్ సలహా ఇచ్చారు.
చర్చించే దమ్ముందా?
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు దకిన రాజ్యాంగబద్ధ హామీ అయిన బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీలను ఇవ్వకుండా దారుణంగా వంచించిన చరిత్ర బీజేపీదని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రైవేటు రంగంలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి ‘మీకు మూ తోడ్ జవాబ్ ఇచ్చాం’ అని చెప్పారు. దేశానికే తలమానికంగా పారిశ్రామిక రంగాన్ని నిలిపిన తెలంగాణ నుంచి పాఠాలు కొన్నయినా నేర్చుకోవాలని సూచించారు. బీజేపీ పాలన.. మోదీ విధానాలతో దేశ ఆర్థిక రంగం అయోమయంలో పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, రూపాయి విలువ పాతాళానికి పడిపోతున్నదని, వాట్సాప్ యూనివర్సిటీ పాఠాలు తప్ప ఎకానమీ లెకలు తెలియని మోదీ నాయకత్వం దికుతోచక బిత్తిరి చూపులు చూస్తున్నదని ఎద్దేవాచేశారు. అదే సమయంలో తెలంగాణ ప్రగతిశీల ప్రభుత్వం మాత్రం ‘సంపద సృష్టించు-సమాజానికి పంచు’ అనే ఉదాత్తమైన లక్ష్యంతో పని చేస్తున్నదని పేర్కొన్నారు. రేసుగుర్రంలా దూసుకుపోతున్న రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై స్పెషల్ క్లాసులు చెప్పించుకోవాలని వ్యాఖ్యానించారు. జాతీయ సగటు కన్నా అన్ని సంవత్సరాల్లో అధికంగా పెరుగుతున్న రాష్ట్ర జీఎస్డీపీ, రెట్టింపయిన సగటు తలసరి అదాయం, చిన్న రాష్ట్రమే అయినా దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా నిధులు అందిస్తున్న 4వ రాష్ట్రంగా తెలంగాణ ఉన్న తీరు నుంచి ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలని మోదీకి సూచించారు. మోదీ పాలనలో ప్రపంచంలోనే అత్యధిక వంట గ్యాస్ సిలిండర్ ధర ఆకాశాన్ని తాకిందని అన్నారు. సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న నిత్యావసర సరుకులు, పెట్రో ధరలపై మోదీకి దమ్ముంటే ఈ సమావేశాల్లో చర్చ పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
దాహార్తి తీర్చే మిషన్ భగీరథ
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో గుకెడు తాగునీటి కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న భారతం ఓ వైపుంటే, గడప ముంగిటకే గోదారమ్మ, కృష్ణమ్మ జలధారల సవ్వడితో మెరుస్తున్న ఆడబిడ్డల ముఖాలు తెలంగాణలో కనిపిస్తాయని కేటీఆర్ చెప్పారు. తరతరాలుగా తిష్ఠ వేసుకొన్న ఫ్లోరైడ్ రకసిని తెలంగాణ నుంచి తరిమికొట్టిన తీరును మోదీ కచ్చితంగా తెలుసుకోవాలని కోరారు. దేశంలో ఎకడాలేనివిధంగా ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ ఘనతను గుర్తించి, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో బిందెడు నీళ్ల కోసం ప్రాణాలు పణంగా పెట్టి బావుల్లోకి దిగుతున్న ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకు మిషన్భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
నిరంతరం విద్యుత్తు వెలుగులు
2018లోనే ప్రతి గ్రామానికి కరెంటు ఇచ్చామంటూ మోదీ చెప్పిన అబద్ధాలను దేశం ముందు నిలబెట్టేలా ఉన్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము సొంతగ్రామంలో కరెంటు రాని పరిస్థితికి మోదీ పాలన నిదర్శనమని ఎద్దేవాచేశారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంటు సరఫరా చేయలేక చేతులెత్తేసి పవర్ హాలిడేలు ప్రకటిస్తున్న పరిస్థితి ఉన్నదని చెప్పారు. తెలంగాణలో మాత్రం రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల విద్యుత్తుతో ప్రకాశిస్తున్నదని, ఆ వెలుగులను చూడాలని కోరారు. బీజేపీ అసమర్థ ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లో చీకట్లు ఎలా తొలగించాలో తెలంగాణను చూసి తెలుసుకోవాలని సూచించారు.
అన్నదాతను కంటికి రెప్పలా
వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్రలను ఎదిరించి సాగును పండుగలా మార్చి, అన్నదాతను కంటికి రెప్పలా తమ సరారు కాపాడుకుంటున్నదని కేటీఆర్ వివరించారు. 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా పథకాలు, రైతువేదికలతో అన్నదాత తలరాత మారుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పాన్ని చూసైనా దేశ వ్యవసాయరంగంపై బీజేపీ ప్రభుత్వానికి ఉన్న కక్షపూరిత వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ‘మా రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి ప్రారంభించిన మీ పీఎం కిసాన్ యోజనలో గత మూడేండ్లుగా కొత్త రైతులకు అవకాశం ఇవ్వడం లేదు. ఎకరానికి కేవలం రూ.6 వేలతో సరిపుచ్చుతున్న మీ విధానాన్ని సవరించి, దేశ రైతాంగానికి మరింత చేయూత ఇవ్వండి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
పేదోడి గుమ్మం ముందుకే వైద్యం
మాటలతో మభ్యపెట్టడం, మసిపూసి మారేడుకాయ చేయటం బీజేపీకి అలవాటని కేటీఆర్ విమర్శించారు. కేంద్రం ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వంగా సొంతంగా జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రతిపల్లెలోనూ ప్రాథమిక వైద్యాన్ని పటిష్ఠంగా మారుస్తున్నామని, హైదరాబాద్ మహానగరంలో బస్తీకో దవాఖాన ఏర్పాటుచేసి ఖరీదైన వైద్యాన్ని పేదోడి గుమ్మం ముందుకు తెచ్చామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్షల కార్యక్రమం కంటి వెలుగును చేపట్టామని, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ను డిజిటలీకరణ చేస్తున్నామని, చేతనైతే ఇలాంటి వైద్య విధానాలను అధ్యయనం చేసి బీజేపీ రాష్ర్టాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం.. మిషన్ కాకతీయను చూసి నేర్వండి
జీవ నదులున్న దేశంలో వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. నదికే పునర్జన్మనిచ్చి, ఏడాది పొడవునా జలధారలతో పుడమి తల్లిని మురిపిస్తూ…ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం దేశ సాగునీటి రంగాన్ని ఎలా బలోపేతం చేసిందో నేర్చుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రాజెక్టులు స్వరాష్ట్రంలో పూర్తయిన తీరును కండ్లారా చూసి, బీజేపీ పాలిత రాష్ర్టాలకు తెలంగాణను సాగు నీటిరంగ పురోగతిని కేస్స్టడీలా చూపాలని సలహా ఇచ్చారు. 46 వేల చెరువులకు పునర్జన్మనిస్తూ భూగర్భజలాల సంరక్షణలో ఆలిండియా అధికారులకు శిక్షణపాఠంగా మారిన మిషన్కాకతీయ విజయగాథను ఓపికగా విని అర్థం చేసుకోవాలని కోరారు. ‘మీ బూటకపు డబుల్ ఇంజిన్తో ప్రజలకు ట్రబుల్గా మారిన మీ రాష్ర్టాల్లో మిషన్ కాకతీయ అమలుకు ప్రయత్నించండి’ అంటూ మోదీకి కేటీఆర్ సలహా ఇచ్చారు.
ఐటీలో మేటిగా ఎదిగాం
‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని తెలంగాణ త్యాగాలను చులకన చేసి మాట్లాడిన మీరు, ఈ గడ్డ బాగు కోరుతారని ఇకడ ఎవరూ భావించడం లేదు’ అని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారబోతున్న హైదరాబాద్ ఐటీ రంగానికి మీ వెన్నుపోటును యువత మరవదని చెప్పారు. ఐటీఐఆర్ను రద్దుచేసి తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఆపుదామనుకున్న మోదీ నికృష్ట రాజకీయాలకు పనితీరుతో జవాబు చెప్పామని తెలిపారు. 8 ఏండ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులను 3 రెట్లు చేసి లక్షా ఎనభైమూడు వేల కోట్లకు చేర్చామని వివరించారు. గత ఏడాది దేశ ఐటీరంగం నాలుగున్నర లక్షల ఉద్యోగాలు సృష్టిస్తే, వాటిలో మూడోవంతు తెలంగాణకే దకాయని గుర్తుచేశారు. కేంద్రంలోని మీరు, మిగతా రాష్ర్టాలు కనీసం ఊహించలేని వినూత్న పారిశ్రామిక విధానాలతో తెలంగాణలో ఐటీ, పారిశ్రమిక రంగం అభివృద్ధి చెందిన తీరును బిజినెస్ సూల్స్ పాఠాలుగా చెపుతాయని, వాటిని మోదీ శ్రద్ధగా వినాలని హితవు పలికారు.
ఐటీఐఆర్ను రద్దుచేసి తెలంగాణ ప్రగతిని ఆపుదామనుకున్న మీ నికృష్ట రాజకీయాలకు పనితీరుతోనే జవాబు చెప్పాం. 8 ఏండ్లలో ఐటీ ఎగుమతులను 3 రెట్లు చేసి లక్షా ఎనభైమూడు వేల కోట్లకు చేర్చాం. ఐటీ, పారిశ్రామికంలో రాష్ట్ర అభివృద్ధిని బిజినెస్ సూల్స్ పాఠాలుగా చెప్తున్నాయి..వాటిని శ్రద్ధగా వినాలి.
–మోదీకి కేటీఆర్ హితవు
స్వాతంత్య్రం వచ్చాక ఎన్నడూ లేనంతగా పెరిగిన నిరుద్యోగితను తగ్గించే యాక్షన్ప్లాన్ తెలంగాణలో ఉన్నది. దాన్ని వెతికి పట్టుకోండి. సమాజాన్ని ముకలుగా చీలుస్తున్న మీరు ఒక వైపు ఉంటే, పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా దేశచరిత్రలో ఎకడా లేనివిధంగా సమ్మిళిత అభివృద్ధి నమూనాను పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో అమలుచేస్తున్న కేసీఆర్ మరోవైపు ఉన్నారు. ఆ ప్రయత్నాన్ని మీరిచ్చిన అవార్డుల సాక్షిగానే అధ్యయనం చేసి వెళ్లండి.
–మోదీకి కేటీఆర్ సలహా
బీజేపీ పాలన.. మోదీ విధానాలతో దేశ ఆర్థిక రంగం అయోమయంలో పడింది. ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. రూపాయి విలువ పాతాళానికి పడింది. వాట్సాప్ యూనివర్సిటీ పాఠాలు తప్ప, ఎకానమీ లెకలు తెలియని మోదీ నాయకత్వం, దికుతోచక బిత్తిరి చూపులు చూస్తున్నది. తెలంగాణ ప్రగతిశీల ప్రభుత్వం ‘సంపద సృష్టించు-సమాజానికి పంచు’ అనే ఉదాత్తమైన లక్ష్యంతో పనిచేస్తున్నది. రేసుగుర్రంలా దూసుకుపోతున్న రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై స్పెషల్ క్లాసులు చెప్పించుకోవాలి.
–మోదీకి కేటీఆర్ సూచన