ట్రెండింగ్లో #మోదీ మస్ట్ రిజైన్, #స్టెప్ డౌన్ మోదీ
9 గంటలు టాప్లోనే #మోదీ మస్ట్ రిజైన్
ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్పై 94 వేల ట్వీట్లు
అదానీతో ‘బంధం’పై నెటిజన్ల విమర్శలు
ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సాక్ష్యాలు
విదేశాల్లో పరువు తీశారని ప్రముఖుల ట్వీట్లు
బోఫోర్స్ కంటే పెద్ద కుంభకోణం
మాపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మరీ రూ.5 వేల కోట్ల పవర్ ప్రాజెక్టును అదానీ కంపెనీకి అప్పగించేలా చేశారని శ్రీలంక ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ స్వయంగా వెల్లడించారు. అంటే ఇది బోఫోర్స్ కంటే పెద్ద కుంభకోణం. మోదీ తప్పక రాజీనామా చేయాలి.
–ప్రశాంత్ భూషణ్, సామాజిక ఉద్యమకారుడు
సమస్యలు పరిష్కరించు లేదా దిగిపో
‘మోదీ మస్ట్ రిజైన్’ నినాదానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను. ప్రధానిగా మోదీ తాను చేసిన
తప్పిదాలు, వైఫల్యాలకు బాధ్యత వహించాలి. దేశంలోని సమస్యలు పరిష్కరించాలి. లేదా
ప్రధాని పదవికి రాజీనామా చేయాలి. – సంజుక్త బసు, సీనియర్ జర్నలిస్టు
సిగ్గుచేటు
దేశ ప్రధాని చెప్పిన అబద్ధాలను ఒక సీఎం (ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో చూపిన వీడియోను కోట్ చేస్తూ) మీడియా సమావేశంలో దేశ ప్రజలకు వివరించారు. దేశాన్ని బీజేపీ అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టింది. ఇది సిగ్గుచేటు. – ఆర్జేడీ డిజిటల్ టీం
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): #మోదీ మస్ట్ రిజైన్, #స్టెప్ డౌన్ మోదీ.. సోషల్ మీడియా ముక్త కంఠంతో చేస్తున్న డిమాండ్లు ఇవి. ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోదీ దిగిపోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది. ముఖ్యంగా ట్విట్టర్లో మోదీ దిగిపో అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. సాధారణంగా ట్విట్టర్లో ఒక అంశంపై హ్యాష్ట్యాగ్ గంట పాటు ట్రెండింగ్లో ఉండటమే గగనం. అలాంటిది.. బుధవారం ‘మోదీ మస్ట్ రిజైన్’ హ్యాష్ ట్యాగ్ ఏకంగా 9 గంటలకు పైగా ట్రెండింగ్లో ఉన్నది. ఓ దశలో టాప్-1లో కొన్ని గంటలపాటు కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన ఈ హ్యాష్టాగ్లు రాత్రి 12 గంటల వరకు ట్రెండింగ్లోనే ఉన్నాయి. శ్రీలంక ప్రభుత్వంపై భారత ప్రధాని నరేంద్రమోదీ ఒత్తిడి తీసుకువచ్చి అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా పార్టీలు, రాష్ర్టాలు, వర్గాలకు అతీతంగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు తీసేలా నిస్సిగ్గుగా తన మిత్రుల కోసం దేశ ప్రతిష్ఠను దిగజార్చిన ప్రధాని అంటూ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్టుల నుంచి మొదలుకొని అన్ని వర్గాల వారు దుమ్మెత్తి పోస్తున్నారు. అదానీ, అంబానీతో అంటకాగుతూ అందినకాడికి దోచుకొంటున్నారని విమర్శిస్తున్నారు.
మోదీ విదేశీ పర్యటనల్లో తన మిత్రుడు అదానీకి మేలు చేసే ఏదో ఒక ఎంవోయూ కుదుర్చుకోకుండా తిరిగి రాలేదన్న విషయాలు ఒక్కొక్కటిగా సాక్ష్యాలతో సహా బయటికి రావటంతో మోదీ దిగిపోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ‘నేను ఫకీర్ లాంటి వాడిని.. రేపటి రోజు జోలె పట్టుకొని వెళ్లిపోతాను.. నాకు సంపాదన, ఆస్తిపాస్తులపై ఆశలు లేవు’ అని చెప్పిన అవి‘నీతి’ మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, నాయకులు, కార్యకర్తలు, వేల మంది నెటిజన్లు ప్రధాని మోదీ రాజీనామా చేయాలని నినదించారు. యువతకు ఉద్యోగాలేవి? పెరిగిన ధరల సంగతేంది? మత విద్వేషం పేరుతోనే రాజకీయాలా? ఇలా అనేక అంశాలను ప్రశ్నిస్తూ నెటిజన్లు హ్యాష్టాగ్లు పెడుతూ విమర్శలు గుప్పించారు. ట్విటర్లో #మోదీ మస్ట్ రిజైన్కు గంటల వ్యవధిలోనే 94వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి.
చెడుగుడు ఆడుతున్న నెటిజన్లు
మోదీ రాజీనామా చేయాల్సిందే
తన మిత్రుల కోసం ఇన్నేండ్లు బయటపడకుండా ప్రధాని మోదీ రాయబారం నడిపించారు. మోదీ పర్యటనలు, అంబానీ, అదానీలకు దకిన కాంట్రాక్టులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమౌతున్నది. ఇప్పుడు మరింత నిస్సిగ్గుగా ఏకంగా తన మిత్రుడి కోసం పొరుగు దేశంపై ఒత్తిడి తీసుకొచ్చారనే విషయం స్పష్టమైంది. శ్రీలంకకు చెందిన ఉన్నతాధికారే ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు. అంటే అవినీతికి పాల్పడినట్టే కదా! మరి అవినీతికి పాల్పడిన మోదీకి ప్రధాని పదవిలో ఉండే అర్హత ఉన్నదా? ఎట్టి పరిస్థితిలోనూ లేదు. చేసిన తప్పుకు బాధ్యతగా ప్రధాని రాజీనామా చేయాల్సిందే. లేకపోతే సుప్రీం కోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాల్సిందే. లేకపోతే భారత్ మున్ముందు ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సిన దౌర్భాగ్యం దాపురిస్తుంది. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక ప్రధానమంత్రి కార్పొరేట్ కంపెనీకి సేల్స్మెన్గా మారిపోయారు.
– వై సతీశ్రెడ్డి, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్