Disability Pension | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): సైనికుల త్యాగాలను రాజకీయ లబ్ధికి వాడుకొని అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్, తన అసలు బుద్ధి బయటపెట్టుకుంది. సర్వీసులో ఉండగా వైకల్యం పొందిన సైనికులకు ఇచ్చే ‘డిసెబిలిటీ పెన్షన్’ నిబంధనల్ని కఠినతరం చేసింది. డిఫెన్స్ సిబ్బంది, వారి వితంతువులకు ఇచ్చే పెన్షన్ నిబంధనల్ని మార్చింది.
వైకల్యం పెన్షన్ పొందేందుకు ఆఫీసర్ ట్రెనీస్, క్యాడెట్స్కు అర్హత లేదంటూ కొత్త నిబంధనావళి పేర్కొన్నది. ఈ మేరకు సెప్టెంబర్ 22న రక్షణశాఖ జారీచేసిన నిబంధనావళిపై విపక్షాలు, మాజీ సైనికుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ సర్కార్ తీరును ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. పెన్షన్ ఎగవేసేందుకే కొత్త నిబంధనల్ని కేంద్రం తీసుకొచ్చిందని ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ వైస్ చైర్మన్ బీమ్సెన్ సెహగల్ మండిపడ్డారు.
10 ఏండ్ల సర్వీసు ఉంటేనే పెన్షన్
తాజా ఉత్తర్వుల ప్రకారం, పదేండ్ల సర్వీసు కలిగి ఉంటేనే మాజీ సైనికులు, వారి వితంతువులు వైకల్య పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. శిక్షణ కాలంలో వైకల్యానికి గురయ్యే సైనికులకు వర్తించదు. కొత్తగా విధించిన షరతులు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధమని సెహగల్ అన్నారు. సాధారణ ఉద్యోగులకు లేని నిబంధనలను సైన్యంలో పని చేసిన వారికే పెట్టడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు.