హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): భవిష్యత్తు సవాళ్లను సాంకేతికతతతో ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జియో స్పేషియల్ టెక్నాలజీ అంతులేని అవకాశాలను కల్పిస్తున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెండో కాంగ్రెస్లో ప్రధాని వర్చువల్గా పాల్గొన్నారు. సాంకేతికత నేడు ప్రపంచ మారుమూలలను సైతం ఏకం చేస్తున్నదని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి భారత్ ఎన్నో ఏండ్లుగా కృషి చేస్తున్నదని చెప్పారు.
భారత అభివృద్ధికి సాంకేతికత, ప్రతిభ రెండు స్తంభాలుగా నిలుస్తున్నాయన్నారు. నేడు కోట్ల మంది భారతీయులు ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నారని, చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులను అంగీకరించే స్థితి వచ్చిందని చెప్పారు. కొవిడ్ సమయంలో అనేక కార్యక్రమాలకు సాంకేతికత పునాదిగా ఉన్నదని తెలిపారు. జియో స్పేషియల్ టెక్నాలజీ ఫలితాలు ఇప్పుడు గ్రామగ్రామానికి చేరుతున్నాయన్నారు. జియోస్పేషియల్ టెక్నాలజీ అంతులేని అవకాశాలను అందిస్తున్నదని చెప్పారు. స్థిరమైన పట్టణ అభివృద్ధి, విపత్తుల నిర్వహణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తెలుసుకోవడం, అటవీ నిర్వహణ, నీటి నిర్వహణ, ఆహార భద్రత ఇలా అనేక రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇలాంటి సదస్సులను ఐరాస నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు.
దాదాపు 150 దేశాల నుంచి రెండువేలమందికి పైగా పాల్గొంటున్న సదస్సు రెండో రోజు కార్యక్రామలను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ప్రారంభించారు. ఈ నెల 14వరకు సదస్సులు కొనసాగనున్నాయి.
హైటెక్ విజన్కు హైదరాబాద్ ప్రసిద్ధి : మోదీ ప్రశంస
ఐక్యరాజ్యసమితి హైదరాబాద్లో జియోస్పేషియల్ అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉన్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం సంస్కృతిలో ఎంతో గొప్పదని, ఈ నగరం హైటెక్ విజన్కు ప్రసిద్ధి చెందినదని ప్రశంసించారు. ‘హైదరాబాద్ నగరం గొప్ప సంస్కృతికి, వంటకాలకు, ఆతిథ్యానికి అదేవిధంగా హైటెక్ విజన్కు ప్రసిద్ధి చెందినది’ అంటూ ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల నుంచి వచ్చిన రెండువేల మందికిపైగా విదేశీ ప్రతినిధులకు వివరించారు.