న్యూస్నెట్వర్క్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని బేగంపేట్, యాకుత్పుర రైల్వేస్టేషన్లను అమృత్ స్టేషన్లుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వాటికి సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకంలో భాగంగా రూ.22.57 కోట్ల వ్యయంతో బేగంపేట్ స్టేషన్ను, రూ.8.53 కోట్ల వ్యయంతో యాకుత్పుర రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో గల కాసిపేట రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని, బెల్లంపల్లి మండలం కన్నాల ప్రాంతంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం శివపూర్ బారేగూడలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కన్నాల ప్రాంతంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. రామంతాపూర్కు వెళ్లే దారిలో ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేసినట్టు మెదక్ కలెక్టర్ రాజర్షి షా వివరించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా జడ్చర్లలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, గద్వాలలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి శిలాఫలకాలను ఆవిష్కరించారు.