ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
ఎన్నారైలంతా ఆయన వెంటే: మహేశ్ బిగాల
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యహరిస్తుంటే సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను రెండు కండ్లుగా పాలిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను తన స్నేహితుడు అదానీకి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. మోదీ దేశ ప్రజలకు ప్రధానిగా ఉన్నారా? అదానీ కోసం పనిచేస్తున్నారా? అనే అనుమానం కలుగుతున్నదని మండిపడ్డారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) సభల సందర్భంగా టీఆర్ఎస్ యుఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోదీ కార్పొరేట్ల ప్రతినిధి అని, కేసీఆర్ సామాన్యుల ప్రతినిధి అని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలిచిందని అన్నారు. బీజేపీకి ఒక విధానం, నినాదం లేదని ఆరోపించారు.
ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ విధానంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని తెలిపారు. దేశమంతా ఇప్పుడు తెలంగాణ వైపు, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని అనగానే.. ఎన్నారైలు ‘జై భారత్.. జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ పెద్దఎత్తున నినదించారు. ప్రపంచంలో 50కి పైగా దేశాల్లో శాఖలు ఉన్న ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ అని పార్టీ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. ఎన్నారైలంతా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా యుఎస్ఏ ఎన్నారై శాఖ, ఇతర దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ శాఖల ప్రతినిధులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.
కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, చామకూరి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, గాదరి కిశోర్, చల్లా ధర్మారెడ్డి, చంటి క్రాంతి కిరణ్, బొల్లం మల్లయ్య యాదవ్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ యుఎస్ఏ విభాగం సభ్యులు పూర్ణ బైరి, నరసింహారావు నాగులవంచ, అనిల్ ఎర్రబెల్లి, రవి ధన్నపనేని, సక్రు నాయక్, నవీన్ జలగం తదితరులు పాల్గొన్నారు.