బీజేపీని గద్దె దించితేనే రాజ్యాంగానికి రక్షణ
హక్కులను హరిస్తున్న మోదీ ప్రభుత్వం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆదివారం నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ఆధునిక కాలంలోనూ కార్మికులు రోజుకు 12-14 గంటలు పని చేయాల్సిన దుస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అదనపు పని గంటలను శాశ్వతంగా అమలు చేసేందుకు చట్టాలు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
కార్మికులు పోరాడి సాధించుకొన్న హక్కులను రక్షించుకొనేందుకు పోరాటాలు చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. బీజేపీని గద్దె దించితేనే దేశానికి, రాజ్యాంగానికి రక్షణ ఉంటుందని స్పష్టంచేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో ప్రజల్లోకి వెళ్లేందుకు వామపక్షాలు ఏకం కావాలని సూచించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీ వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.