శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. కొత్త రాష్ర్టానికి ఏం కావాలని కేంద్ర పెద్దలు అడగరు. రాష్ట్రం ప్రాధేయపడినా ఇవ్వరు. మాకెందుకివ్వరని అడిగితే అది ధిక్కారం కింద జమ. ‘నన్నే ప్రశ్నిస్తావా’ అన్న అహంభావం. దాని ప్రతిఫలం తిట్లు శాపనార్థాలు, సోషల్మీడియాలో బట్టగాల్చి మీదేసేలా నిందలు, దుష్ప్రచారం.
‘ఇలా చేయడం తప్పు కదా’ అని ఎదిరిస్తే ఏక్నాథ్ షిండేలు వస్తారని, ప్రభుత్వాన్ని కూల్చేస్తారని బెదిరింపులు! దర్యాప్తు సంస్థలు వస్తాయని, త్వరలో జైల్లో వేస్తాయని హెచ్చరికలు! ‘ఎందుకు వేస్తారు? ప్రభుత్వాన్ని ఎట్లా కూలుస్తారు? మేమూ చూస్తా’మని ఎదురొడ్డితే ఏకంగా ఎమ్మెల్యేలతో బేరసారాలు. సర్కారును పడగొట్టే తంత్రాలు. ఆ కుతంత్రాన్ని వీడియో కెమెరాల సాక్షిగా బట్టబయలు చేస్తే, ముగ్గురు బ్రోకర్లు రెడ్హ్యాండెడ్గా పట్టుబడితే, బీజేపీ అగ్ర నేత బీఎల్ సంతోష్ మొదలుకుని అనేకమంది ముఖ్యులు కాల్డేటా సాక్షిగా దొరికిపోతే… బీజేపీ రంగు దేశవ్యాప్తంగా బరిబాతల బట్టబయలైతే, ఏ మాత్రం సిగ్గులేకుండా రంగంలోకి ఈడీ, సీబీఐ, ఐటీ! అటకమీంచి పాత కేసుల కట్ట దించి, దుమ్ము దులపాలి. ఏదీ లేకుంటే తన పార్టీ నాయకుడితోనో, కిరాయి నాయకులతోనో ఫిర్యాదు చేయించుకోవాలి. ఏదో ఒక ఆరోపణ చేయించాలి. బీఆర్ఎస్ ముఖ్యులను, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను దర్యాప్తు పేరుతో వేధించాలి.
తెలంగాణకు, బీఆర్ఎస్కు ఎక్కడ మద్దతుగా నిలుస్తారోనని సోదాల పేరుతో పారిశ్రామిక వేత్తలను భయభ్రాంతులకు గురిచేయాలి. తెలంగాణను, దాని కన్నా బీఆర్ఎస్ను రాచి రంపాన పెట్టాలి. వెంటాడాలి. వేటాడి వేధించాలి. ఇది బీజేపీ పెద్దలు ఆడుతున్న ఘోర నాటకం. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య కనీస తేడా లేకుండా… దర్యాప్తు సంస్థలకు, పార్టీ అనుబంధ విభాగాలకు మధ్య భేదం లేకుండా.. పరిపాలనకు, రాజకీయానికి మధ్య హద్దు మిగలకుండా, అడ్డంగా దొరికిపోయామనే కించిత్ సిగ్గు కూడా లేకుండా బీజేపీ కేంద్ర పెద్దలు చేస్తున్న దుర్మార్గ దౌర్జన్యమిది. మా బీఎల్ సంతోష్ను పట్టుకుంటరా? మీ ముఖ్య నేతను ఇరికిస్తం? మా స్వాములను పట్టిస్తరా? మీ ఫిర్యాదీని బోనులో నిలబెడతం. మా పార్టీని బజారుకెక్కిస్తరా? మీ పార్టీపై బురదజల్లుతం.. ఇదీ విలువల పార్టీ పాలకులు జాతికి ఇస్తున్న సరికొత్త సందేశం.
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): కూరిమి గల దినములలో కనిపించని తప్పులు.. స్నేహం విచ్ఛిన్నమైతే నేరాలైపోతాయి. నిజాల సరళరేఖపై నిఠారుగా నిలబడ్డవా.. శత్రువువైపోతావు. ఎదుటివాడి తప్పుల్ని నిలదీసేందుకు ప్రయత్నిస్తే.. ఏదోరకంగా నీ పైనే బురదజల్లడం మొదలవుతుంది. నిలువెల్లా విషం నింపుకొన్న శక్తులు పగబడతాయి. పడగ విప్పుతాయి. కూల్చే కుట్రలకు దిగుతాయి. తెలంగాణపై ఇప్పుడు అలాంటి కాలనాగులు బుసకొడుతున్నాయి. కబళించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమకు ఎదురు నిలబడిన కేసీఆర్పై, తెలంగాణ ప్రజలపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. తొలుత నిధులివ్వకుండా సహాయనిరాకరణ చేసింది. సరేలే అనుకుని, మనపని మనం చేసుకుంటుంటే.. న్యాయంగా దక్కాల్సిన నిధులనూ రాకుండా అడ్డుకున్నది. నీతిఆయోగ్ వంటివి చెప్పినా చెవికెక్కించుకోలేదు. దానినీ ఓర్చుకుంటుంటే, అప్పులు రాకుండా అడ్డుకుంటున్నది. అదికూడా భరించినా, అభివృద్ధి మీద అభాండాలకు దిగింది. అవినీతి ముద్రవేసి తెలంగాణను అభాసుపాలు చేయాలని ప్రయత్నిస్తున్నది. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నది.
నవజాత రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వమే ఎందుకు అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించింది? ఈడీ, ఐటీ, సీబీఐ.. ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు దాడులు చేస్తున్నాయి? తెలంగాణ ప్రభుత్వంలోని వ్యక్తులే ఎందుకు లక్ష్యంగా మారుతున్నరు? వీటన్నింటికి ఒక్కటే సమాధానం. కేసులు లేకున్నా, అవినీతి జరుగకున్నా ప్రతిపక్ష నేతలను రాచిరంపాన పెట్టడం బీజేపీ నైజం. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఈ కక్ష సాధింపులో భాగంగానే బీజేపీ పెద్దలు టీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నారు. అది ఈడీ కావొచ్చు, సీబీఐ కావొచ్చు, ఐటీ కావొచ్చు. ప్రత్యక్షంగా కావొచ్చు, పరోక్షంగానైనా కావొచ్చు. ఇప్పటికి ముగ్గురు నలుగురు మంత్రులను, ఇద్దరు ముగ్గురు ఎంపీలను, మరో నలుగురైదుగురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను వారు టార్గెట్గా చేసుకున్నారు. ఈ సంఖ్య మున్ముందు మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు తెలంగాణ నేల నుంచి నిలువెత్తు ఎదిగి, విజయ పతాకలుగా భాసిల్లుతున్న దాదాపు పదీ పన్నెండు వివిధ రంగాల సంస్థలను కూడా బీజేపీ పెద్దలు గురిగా ఎంచుకున్నారు. ఏదోరకంగా తెలంగాణ మీద పగ సాధించడం, తెలంగాణ ముఖ్యులను, నేతలను, వ్యాపారవేత్తలను భయభ్రాంతులకు గురిచేయడం.. తద్వారా తెలంగాణ విజయ ప్రస్థానాన్ని అడ్డుకోవడం బీజేపీ పెద్దల వ్యూహం.
గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రధాని పీఠం అధిరోహించిన మోదీ.. జాతీయ రాజకీయాల వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగువేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అభద్రత వారిని వెంటాడుతున్నదని అర్థమవుతున్నది. సమస్య మొదలైంది అక్కడే. బీజేపీ విధానాలతో విసిగిపోయి ఉన్న దేశప్రజలకు విలుప్త స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఏ మాత్రం ఆశను కల్పించలేకపోయింది. ఇతర పక్షాలు మోదీని ఎదిరించే స్థితిలో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో దేశప్రజల కోసం అవసరమైతే ‘జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను’ అని 2018 మార్చి 3వ తేదీన సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘దేశంలో గుణాత్మక మార్పు అవసరం’ అని ఆయన స్పష్టంచేశారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి మోదీ పాలనలోని అసమర్థతను, అన్ని రంగాల్లో వైఫల్యాలను దేశం ముందు ఎండగట్టారు. ఏడు దశాబ్దాల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు. సీఎం కేసీఆర్ సంధించిన ఒక్కో ప్రశ్న ఒక్కో బాణంలా కేంద్రంలోని పెద్దలకు గుచ్చుకున్నది. తెలంగాణలో పండే బాయిల్డ్ రైస్ను తీసుకోబోమని కేంద్రం మొండికేయడంతో సీఎం కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కేంద్రప్రభుత్వంపై నిరసన కార్యాచరణను ప్రకటించారు. గతేడాది నవంబర్ 18న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. ఆ తర్వాత పలు దఫాలుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోవడంతో.. ఈ ఏడాది ఏప్రిల్ 10న ఏకంగా ఢిల్లీలో సీఎం కేసీఆర్ ధర్నా చేపట్టారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏప్రిల్ 27న హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన పార్టీ ప్లీనరీలో దేశంలోని దుర్భర పరిస్థితులను సీఎం కేసీఆర్ వివరించారు. ‘దేశంలో ఇప్పుడున్న దరిద్రం పోవాలంటే.. ప్రత్యామ్నాయ పార్టీలు, ఫ్రంటులు, టెంటులు కాదు ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. పార్టీలు గెలవడం కాదు, ప్రజలు గెలవాలి’ అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానం చేసింది. దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వస్తే ఎలా ఉంటుందో జాతీయ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. దీంతో సీఎం కేసీఆర్తో తమకు కలిగే నష్టం ఏమిటో మోదీ, అమిత్షాకు అర్థమైంది. టీఆర్ఎస్ను భారత రాష్ట్రసమితిగా మార్చుతున్న ట్టు అక్టోబర్ 6న సీఎం కేసీఆర్ ప్రకటించడం, ఈసీకి దరఖాస్తు చేయడం, డిసెంబర్ 9న బీఆర్ఎస్గా అవతరించడం.. ఈ పరిణామాలు బీజేపీ పెద్దలకు మింగుడుపడటం లేదు.
అసలు జాతీయ రాజకీయాల్లో ఏం జరుగుతున్నది? బీఆర్ఎస్కు, బీజేపీకి మధ్య వైరం ఏమిటి? రెండు పార్టీల మధ్య దూరం ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలైంది? తెలంగాణపై బీజేపీ పెద్దలు ఎందుకు కక్షసాధింపునకు దిగుతున్నారో అర్థం చేసుకోవాలంటే మోదీ పాలన ప్రారంభం నుంచీ, తెలంగాణ ఏర్పాటు నుంచీ పరిణామాల వరుసక్రమాన్ని అర్థం చేసుకోవాలి.
కేంద్రంలోని బీజేపీకి స్నేహం చేయడం చేతగాదని, పాలన అంతకన్నా చేతగాదని సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారు. మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను మోదీ, షాలు కూలగొట్టారు. ఓవైపు పెద్ద నోట్ల రద్దు దుష్పరిణామాలు అన్ని రంగాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నిరంగాలు కుదేలవుతూ ఆర్థిక వృద్ధి పడిపోవడం ప్రారంభమైంది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారు. సబ్సిడీలను ఎత్తివేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను అమలు చేస్తున్నారు. అన్నింటికంటే దుర్మార్గంగా.. దేశ వ్యవసాయరంగాన్ని దెబ్బతీసేలా మూడు నల్ల చట్టాలను తెచ్చారు. వాటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేస్తే.. కేంద్రం పట్టించుకోకపోవడంతో సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని ఆదుకొంటుంటే.. మోదీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి ఎత్తులు వేయడాన్ని తట్టుకోలేకపోయారు. దీంతో కేంద్రంపై పూర్తిస్థాయిలో కేసీఆర్ సమరశంఖం పూరించారు. బీజేపీ పెద్దలకు అదే కంటగింపుగా మారింది. కక్షసాధింపునకు దిగేలా పురికొల్పింది. తెలంగాణను రాజకీయంగా దివాళా తీయించేందుకు కుట్రలకు దిగేలా చేసింది.
విపక్షంపై దర్యాప్తు సంస్థలను ప్రేరేపిస్తున్న బీజేపీ నేతలు.. తమపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చే విషయంలో మాత్రం విచారణ సంస్థలకు ఏ మాత్రమూ సహకరించడంలేదు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ ముందు హాజరయ్యేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన నుంచి స్పందన లేదు. పైగా సిట్ విచారణను తప్పించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దర్యాప్తు సంస్థకు సహకరించకుండా ఆయన తప్పించుకు తిరగడంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్నది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు ధైర్యంగా కేంద్రసంస్థల విచారణను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్సీ కవిత ఈ నెల 11వ తేదీన సీబీఐ అధికారులకు వివరణ ఇచ్చా రు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీకి వెళ్లి విచారణకు హాజరై వచ్చారు. మంత్రి మల్లారెడ్డి మూడురోజులపాటు ఐటీ సోదాలకు పూర్తిగా సహకరించారు. ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, ఎమెల్సీ ఎల్ రమణ సైతం పిలిచిన సమయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ పేరుతో సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు కొన్ని నెలలుగా తెలంగాణ మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వేధిస్తూనే ఉన్నారు. అయినా ఇప్పటివరకు వారికి వ్యతిరేకం గా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారు. దీన్నిబట్టి ఇవి కల్పిత ఆరోపణలని, కక్షసాధింపు లో భాగంగా పుట్టించినవేనని స్పష్టమవుతున్నది.
స్నేహం పేరుతో మిత్ర పక్షాలను వంచించడం బీజేపీకి కొత్తకాదు. దాని బారిన పడిన పార్టీలు దేశంలో తక్కువేమీ లేవు.
ఈ ఏడాది అక్టోబర్ 26న బీజేపీ తరఫున వచ్చిన ముగ్గురు బ్రోకర్లు.. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేస్తూ వీడియో ఆధారాలతో సహా దొరికిపోయారు. వారిని విచారించినప్పుడు ఫోన్లు, ల్యాప్టాప్ల నుంచి సంచలన సమాచారం బయటికి వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందుకు తగిన సాంకేతిక ఆధారాలు కూడా లభించాయి. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ బండారం బట్టబయలైంది. ప్రజలంతా బీజేపీ నైజాన్ని ఛీత్కరించుకున్నారు. దీంతో బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యిం ది. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు పార్టీ ముఖ్యులకు నోటీసులు ఇవ్వ డం, ఈడీ విచారణకు పిలిపించడం, ఐటీ సోదాలు జరిపించడం వంటి చర్యలకు దిగింది. ఈ పరిణామాలన్నింటినీ ఒకసారి నిశితంగా గమనిస్తే.. తెలంగాణపై, సీఎం కేసీఆర్పై కక్షతోనే ఇదంతా చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. తమ బండారం బయటపెట్టి, బోనులో నిలబెట్టారు కాబట్టే.. ఏదోరకంగా తామూ బురదజల్లాలన్న కసి ఇది.
టీఆర్ఎస్ ప్లీనరీ రాజకీయ తీర్మానం అనంతరం బీజేపీ తన పన్నాగాన్ని మొదలుపెట్టింది. రాజకీయంగా సీఎం కేసీఆర్ను రాష్ర్టానికే పరిమితం చేసేందుకు ఉపఎన్నిక తేవాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూలై రెండోవారంలో అప్పటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో రహస్యంగా సమావేశమయ్యారు. ఆగస్టు 8న ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనివార్యంగా మునుగోడుకు ఉపఎన్నిక తెచ్చి, ప్రజలపై రుద్దారు. ఇందుకోసం రూ.18 వేల కాంట్రాక్ట్ను రాజగోపాల్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టారు. దాంట్లో విజయం సాధించడం, ఆ ఎరతో గులాబీ ఎమ్మెల్యేలను కొని సర్కారును కూల్చడం ద్వారా కేసీఆర్ను నిలువరించవచ్చని వారు భ్రమపడ్డారు. అందులో భాగంగా వెలుగు చూసిందే ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం. అప్పటికే 8 రాష్ర్టాల్లోప్రభుత్వాలను కూలగొట్టిన బీజేపీ.. తెలంగాణలోనూ అదే చేయవచ్చని దుస్సాహసానికి దిగింది. అయితే మునుగోడులో ఓటర్లు కర్రుగాల్చి వాత పెట్టగా, రాజకీయ చాణక్యుడైన కేసీఆర్ మొయినాబాద్ ఫాంహౌస్లో వాళ్ల బండారాన్ని బయటపెట్టారు.
తమ నియంతృత్వ విధానాలతో దేశంలోని నేతలందరినీ నోరుమెదపకుండా చేశామని మోదీ, అమిత్షా విర్రవీగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ఎదురుతిరగడాన్ని వారు తట్టుకోలేకపోయారు. ఓ వైపు తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబెడుతూ.. మరోవైపు మీరెందుకు ఇలా చేయలేకపోతున్నారని ప్రశ్నించడాన్ని సహించలేకపోయారు. దీంతో తెలంగాణపై, సీఎం కేసీఆర్పై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు మూడు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.
1) సీఎం కేసీఆర్ను తెలంగాణకు పరిమితం చేయడం.
2) తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడం
3) తెలంగాణ నేతలపై అవినీతి ముద్ర వేయడం
ఇందుకు ఈ ఏడాది జూలై నుంచే కుట్రలను అమలు చేయడం మొదలుపెట్టారు. లిక్కర్స్కాం పేరుతో సీబీఐ, క్యాసినో కుంభకోణం పేరుతో ఈడీని రంగంలోకి దింపారు.