హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): దేశంలో రోజు రోజుకీ ఆకలి కేకలు పెరుగుతున్నాయి. పేదోడికి బుక్కెడు బువ్వ దొరకడం లేదు. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 101వ స్థానం నుంచి 107 స్థానానికి దిగజారింది. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు అన్నం పెట్టి ఆదుకోవాల్సిన కేంద్రం.. నోటికాడి ముద్దను లాగేసుకున్నది. ఇందులో భాగంగానే పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం కోటాలో కోత పెట్టింది. గతంలో ఒక్కో వ్యక్తికి 10 కిలోల చొప్పున ఇచ్చే బియ్యం కోటాను ఇప్పుడు 5 కిలోలకు తగ్గించింది. బియ్యం కొరతే ఇందుకు కారణమని తెలిసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వరి సాగు తగ్గటంతో బియ్యం ఉత్పత్తి తగ్గిపోయింది. తద్వారా అనివార్యంగానే బియ్యం కొరత ఏర్పడింది. దీంతో పేదలకు ఉచితంగా పంచాల్సిన బియ్యాన్ని సమకూర్చడం ఇబ్బందికరంగా మారడం వల్లనే ఆ కోటాలో కేంద్రం కోత పెట్టినట్టు తెలిసింది.
సగం మందికి ఇవ్వడానికే ఆపసోపాలు
కరోనా మహమ్మారి పేదల జీవితాల్లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ ప్రభావం ఇప్పటికీ పేదలపై కొనసాగుతూనే ఉన్నది. వారంతా ఉచిత బియ్యంతోనే కడుపు నింపుకుంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో బియ్యం కోటా తగ్గించటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో సగం కార్డులకు కేంద్రం బియ్యం సరఫరా చేస్తుండగా.. మిగిలిన సగం కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో బియ్యం పంపిణీ చేస్తున్నది. కేంద్రం కార్డుల్లో ఒక్కో వ్యక్తికి 5 కిలోలు (కేజీ రూ.3కు ఇస్తే అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.2 భరించి పేదలకు రూ.1కే పంపిణీ చేస్తున్నది) ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తమ కార్డుల్లో ఒక్కో వ్యక్తికి 6 కేజీలు ఇస్తున్నది. కరోనా తర్వాత కేంద్రం ఒక్కో వ్యక్తికి అదనంగా 5 కేజీలు పంపిణీ చేసింది. దానికి తగ్గట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 కేజీలు అదనంగా ఇచ్చింది. అయితే ఇటీవల కేంద్రం తను అదనంగా ఇస్తున్న 5 కేజీలను హఠాత్తుగా కోసేసింది. గతంలో ఇచ్చిన విధంగా 5 కేజీలే పంపిణీ చేస్తుండటంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సగానికిపైగా లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వమే బియ్యం పంపిణీ చేస్తున్నది. మిగిలిన సగం మందికి ఇవ్వడానికే కేంద్రం ఆపసోపాలు పడుతున్నది.
పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర
పేదల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన ప్రజా పంపిణీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా మోదీ సర్కారు అడుగులేస్తున్నది. అందులో భాంగంగానే బియ్యం పంపిణీతోపాటు ఆహార సబ్సిడీ నిధుల్లోనూ కోత పెడుతున్నది. 2022-23లో ఈ సబ్సిడీలకు బడ్జెట్లో రూ.2.87 లక్షల కోట్లు కేటాయించిన మోదీ సర్కార్.. 2023-24 బడ్జెట్లో ఈ కేటాయింపులను రూ.1.97 లక్షల కోట్లకు కుదించింది. అంటే ఏకంగా రూ.90 వేల కోట్లు తగ్గించింది. మున్ముందు కూడా కేంద్రం ఈ కోతలను కొనసాగించి బియ్యం పంపిణీని పూర్తిగా ఎత్తివేయాలని చూస్తున్నది.
మన బియ్యం కొనుగోలుకు నిరాకరణ
దేశంలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ర్టాల నుంచి బియాన్ని సేకరించి ఇతర రాష్ర్టాలకు సరఫరా చేయాల్సిన కేంద్రం.. తెలంగాణ నుంచి బియ్యం తీసుకునేందుకు నిరాకరిస్తున్నది. దేశవ్యాప్తంగా కొరత ఏర్పడినప్పటికీ తెలంగాణ రైతులు పండించిన దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్నది. నిరుడు యాసంగిలో మన దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిరాకరించిన కేంద్రం.. ప్రస్తుత యాసంగిలోనూ అదే కక్ష సాధింపు ధోరణిని కొనసాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోటాను తగ్గించడం దారుణం
కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం కోటాలో ఐదు కేజీలు తగ్గించడం దారుణం. ఇది పేద ప్రజలకు అన్నం దూరం చేయడమే అవుతుంది. దేశంలో ఆకలి కేకలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వెంటనే కోటాను పునరుద్ధరించి గతంలో మాదిరిగా 10 కేజీల బియ్యం పంపిణీ చేయాలి.
– నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి
పేదల కడుపు కొడుతున్న కేంద్రం
కేంద్రంలోని మోదీ సర్కారు పేదల పాలిట శత్రువుగా మారింది. ఉచిత బియ్యంలో కోటాలో ఐదు కేజీలు తగ్గించి పేదల నోటికాడి ముద్దను లాగేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే పేదలను అక్కున చేర్చుకుంటున్నది. వారికి ఉచితంగా బియ్యాన్ని అందించేందుకు ఇప్పటికే రూ.5 వేల కోట్లు ఖర్చు చేసింది. పేదలు ఆకలితో ఉండొద్దనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకే ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదు.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి