హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. విధానాలంటే ఏమిటో మోదీకి తెలియదని, ఆయన కేవలం నినాదాల రూపకర్త మాత్రమేనని శనివారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు.
మన్ కీ బాత్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఫిట్ ఇండియా, సబ్కా సాత్-సబ్కా వికాస్, బేటీ పడావో-బేటీ బచావో లాంటి అందమైన నినాదాలను తెరపైకి తెచ్చిన మోదీ.. వాటిలో ఒక్కదాన్నయినా సమర్థంగా అమలు చేశారా? అని ప్రశ్నించారు. దివాలాకోరు విధానాలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన మోదీ.. చివరికి ప్రజా సంక్షేమ పథకాలను సైతం లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయోద్యమ సమయంలో ఆరెస్సెస్ ఎవరికి వత్తాసు పలికిందో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.