హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను బద్నాం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై తమకు ఎలాంటి ప్రతిపాదనలూ అందలేదని కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తాజాగా పార్లమెంటులో పేర్కొన్నారు. దీనిపై మంత్రి హరీశ్రావు శుక్రవారం తీవ్రంగా స్పందించారు. జాతీయ హోదా కోసం కేంద్రానికి, ప్రధాని మోదీకి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. తాను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విన్నవించానని చెప్పారు. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పైగా తప్పుడు ప్రచారం చేస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని 2016 ఫిబ్రవరి 23న నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరుతున్న మంత్రి హరీశ్రావు (ఫైల్)
శుక్రవారం ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేస్తూ కేంద్రం వివక్షను ఆధారాలతో ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వం గతంలో కేంద్రానికి రాసిన లేఖలను జత చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్, నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను అనేకసార్లు ప్రధానికి, జల్శక్తి శాఖ మంత్రికి వినతి పత్రాలు అందించాం. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నది’ అని మంత్రి హరీశ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూడీ) అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని, కేంద్ర జలశక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ (టెక్నికల్ అడ్వైజరీ కమిటీ) అనుమతులు కూడా లభించాయని చెప్పారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర సహాయమంత్రి కూడా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్న నేపథ్యంలో జాతీయహోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. అయితే కేంద్ర మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు.
ఆ రెండు ప్రాజెక్టులకు హోదా ఎలా ఇచ్చారు?
‘2018లో టీఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరానికి జాతీయ హోదాపై పార్లమెంట్లో ప్రశ్నించగా.. నాటి జల్శక్తి శాఖ మంత్రి నితిన్ గడరీ స్పందించారు. సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు’ అని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. కానీ ఈ ప్రకటనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ర్టాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్ లోని కెన్-బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని మండిపడ్డారు. పైగా.. కృష్ణా నదీజలాలకు సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2) చేసిన కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నదని గుర్తుచేశారు. న్యాయ విచారణ పూర్తి కాకుండానే, కేటాయింపులు జరుగకుండానే.. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ఏకంగా జాతీయ హోదా ప్రకటించిందని వివరించారు. కానీ అన్ని రకాల అనుమతులున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ప్రకటించలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రతిపాదనను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. ఇది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ రాజకీయ వివక్షకు నిదర్శనం కాదా? అని హరీశ్రావు ప్రశ్నించారు.
బాధ్యతలు చేపట్టిన ఐదో రోజు నుంచే వినతులు
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంపై సీఎం కేసీఆర్ మొదటి నుంచీ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐదు రోజులకే స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. అప్పటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు (రీడిజైనింగ్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుగా మారింది) జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. ఆ ఏడాది ఇదే అంశంపై ఏకంగా మూడుసార్లు కేంద్ర ప్రభుత్వానికి సీఎం స్వయంగా లేఖలు రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిన తర్వాత సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. హరీశ్రావు ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతోపాటు నేరుగా ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు అందజేశారు. కేంద్రప్రభుత్వం ఈ వాస్తవాలన్నీ కప్పిపెట్టి .. తెలంగాణ నుంచి ప్రతిపాదనలే రాలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నది. కాళేశ్వరానికి జాతీయహోదా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఏ ఏ సందర్భాల్లో ప్రతిపాదనలు అందించిందో, ఎన్నిమార్లు విన్నవించిందో.. సాక్ష్యాలు ఇవిగో..