హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తుకు పరిశోధనలే మూలమని మోడెర్నా సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ ఎస్ లాంగర్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైరస్ల వ్యాప్తిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. హైదరాబాద్లో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో 2023 సంవత్సరానికి గాను జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డును ప్రొఫెసర్ రాబర్ట్ ఎస్ లాంగర్కు వర్చువల్గా అందజేశారు. ఈ సందర్భంగా లాంగర్ ఆన్లైన్లో మాట్లాడుతూ… రాత్రికి రాత్రే ఏదీ సాధించలేమని, కానీ సాధించే వరకు పట్టువదలకుండా ముందుకెళ్లాలని సూచించారు. తాను అనేక పద్ధతుల్లో ఏండ్ల తరబడి పరిశోధనలు చేశానని, చివరికి తన లక్ష్యాన్ని సాధించడానికి 200 పద్ధతుల్లో ప్రయోగాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. న్యూక్లియిక్ ఆమ్లాలు, ఎంఆర్ఎన్ఏతో సహా ఏ పరిమాణంలోనైనా అణువులను పంపిణీ చేయగల నానోపార్టికల్స్ను తయారు చేయగలిగానని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధిని తొలిదశలో గుర్తించడం, చికిత్స అందించడంలో మెరుగైన విధానాలను అందించడంపై పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు.