చెన్నూరు.. రాష్ట్ర రాజధానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర సరిహద్దుకు దగ్గరలోని నియోజకవర్గం ఇది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ నియోజకవర్గం దశాబ్దాల పాటు అభివృద్ధికి నోచుకోలేదు. వానకాలం వస్తే రోడ్లన్నీ నీళ్లతో నిండి ఊళ్లకు ఊళ్లు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయేవి. నల్లరేగడి నేలలు కావటంతో గ్రామాలకు బస్సులు కూడా పోయేవి కావు. కొన్ని గ్రామాలకైతే నెలల పాటు బయటి ప్రపంచంతో కనెక్షన్ ఉండేది కాదు. ఇక కరెంటు గోస చెప్పేది కాదు. స్వరాష్ట్రం సాధించుకొని, ఇక్కడి నుంచి బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రవాణా వ్యవస్థ మెరుగైంది. రోడ్డు మార్గాలు, బ్రిడ్జిలు నిర్మితమై అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం, సుమన్ చలవే అని ఇక్కడి ప్రజలు జేజేలు పలుకుతున్నారు.
మంచిర్యాల, మే 16 (నమస్తే తెలంగాణ): తలాపున గోదావరి, ప్రాణహిత నదులున్నా ఉమ్మడి పాలనలో చెన్నూరు నియోజకవర్గం గుక్కెడు నీటికి నోచుకోలేదు. వాగులపై బ్రిడ్జిలు లేక రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వరదలకు కొట్టుకుపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు ఆ దుస్థితి నుంచి అక్కడి ప్రజలకు విముక్తి లభించింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో దాదాపు రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ, నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. దీంతో ఆయా మండలాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సందర్భం ఏదైనా తామంతా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు నాయకత్వంవైపే ఉంటామని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో ‘నమస్తే తెలంగాణ’ బృందం క్షేత్ర స్థాయి పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు
విద్య, వైద్యం, వాణిజ్యం ఏ అవసరమైనా.. నియోజకవర్గంలోని ప్రజలు చెన్నూరుకు రావాల్సిందే. కానీ, అంతకుముందు అక్కడ రవాణా వ్యవస్థ దారుణంగా ఉండేది. వాగులపై బ్రిడ్జిలు లేక పట్టణానికి వచ్చేవారు వాగులను దాటుకొంటూ వచ్చేవారు. వానకాలంలో వాగులు ఉప్పొంగితే రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయేది. అత్యవసర సమయాల్లో వాగులు దాటే సమయంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో పర్యటించిన సుమన్.. ప్రజల అవసరాలు, కష్టాలను తెలుసుకొన్నారు. ఆ సమస్యలను అసెంబ్లీ వేదికగా పలుమార్లు వినిపించారు. ఎన్నో సమస్యలకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత పరిష్కారానికి చొరవ చూపారు.
తొలగిపోనున్న దశాబ్దాల కష్టాలు
శరవేగంగా కొనసాగుతున్న మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారం బ్రిడ్జి పనులు
కోటపల్లి మండలంలో రూ.25.94 కోట్లతో 9 వంతెనలు
చెన్నూర్, మందమర్రి మండలాల్లో
చింతలపల్లి వయా అక్కెపల్లి మధ్య ఏర్పాటు చేయబోయే బ్రిడ్జికి రూ.3 కోట్లు, మందమర్రి- సండ్రోనపల్లి బ్రిడ్జికి రూ.2 కోట్లు, అందుగులపేట-ఏసీస రోడ్డు మధ్య బ్రిడ్జికి రూ.4 కోట్లు, పులిమడుగు- బొక్కలగుట్ట బ్రిడ్జికి రూ.4 కోట్లు.. మొత్తంగా 4 హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.13 కోట్లు మంజూరు చేయాలని విప్ బాల్క సుమన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నా
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవెర్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న. ఇక్కడ పుష్కలమైన వనరులున్నా గత పాలకులు ఏనాడూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్న. అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న. ఇప్పటికే రోడ్లు, బ్రిడ్జిలతో పాటు రైతుల దశాబ్దాల కల నెరవేర్చేలా చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధులు తీసుకురావటం చరిత్రలో నిలిచిపోయింది. బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్నం. విద్య, వైద్యాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నం. వందల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అడగ్గానే నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్