మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ కాలేజీలో కెమెరా కలకలం సృష్టించింది. అమ్మాయిల టాయిలెట్స్లో శనివారం మొబైల్తో వీడియోలు రికార్డు చేస్తున్నట్లు గుర్తించిన విద్యార్థినులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయంపై కాలేజీ ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.
కాలేజీ ఎదుట విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అదే కాలేజీలోని థర్డ్ ఇయర్ స్టూడెంట్ సిద్ధార్థ్గా గుర్తించారు. బ్యాక్లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చిన సమయంలో వాష్రూంలో మొబైల్ కెమెరా పెట్టినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడి నుంచి వీడియో స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. విద్యార్థినుల స్టేట్మెంట్స్ రికార్డు చేశామని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. కాగా, నిందితుడిని కఠిన శిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ ఇచ్చిన హామీతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.