ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా మాదిగలంతా సిద్ధం కావాలని, ఇందులో భాగంగా 19న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హామీని నిలబెట్టుకోవడం ద్వారా బీజేపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు.
ఓయూ టెక్నాలజీ కాలేజీ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి వంగపల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని మాట తప్పిన మోదీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19న ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిర్వహించనున్న మహాధర్నాకు మాదిగలు లక్షలాదిగా తరలిరావాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు మొండిచేయి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా మాల సామాజికవర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క, మాదిగ కులానికి చెందిన దామోదర రాజనర్సింహను మంత్రిగా చేయడాన్ని స్వాగతించామని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు.