హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సీనియర్ పాత్రికేయుడు, ఎమ్మెల్సీ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీకి అపూర్వ గౌరవం లభించింది. ఆయనను రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ప్రొటెంగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన వెన్నవరం భూపాల్రెడ్డి పదవీ కాలం, శాసనమండలి సభ్యత్వం ఈ నెల 4తో ముగిసింది. దీంతో మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ స్థానాలు భర్తీ అయ్యే వరకు ఎమ్మెల్సీ జాఫ్రీని చైర్మన్ ప్రొటెంగా నియమించాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీచేశారు. మజ్లిస్ (ఎంఐఎం) పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న జాఫ్రీ గురువారం మధ్యాహ్నం మండలి చైర్మన్ ప్రొటెంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పీజీ చేసిన సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ.. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ పత్రికల్లో దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు జర్నలిస్ట్గా పనిచేశారు. ఎంఐఎం ఆహ్వానం మేరకు 2010లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ప్రస్తుతం నాలుగోసారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చైర్మన్ ప్రొటెంగా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు జాఫ్రీ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్గా పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్న కే కేశవరావుతోపాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా సేవలందించిన బీహార్ నేత హరివంశరాయ్ బచ్చన్ కూడా పూర్వాశ్రమంలో పాత్రికేయులే.