హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రారంభించిన పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్సీ పోచంపల్లి బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్సింగ్కు ఈ విషయమై లేఖ రాశారు.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకే రూ.30 వేల కోట్ల నిధులను తగ్గించిందని, దీంతో ఉపాధి కూలి పనిదినాలూ తగ్గాయని పేర్కొన్నారు. వ్యవసాయ కూలీకి రోజుకు రూ.257 ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ ఏ ఒక కూలీకి రూ.100కు మించడం లేదని, పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తెలిపారు. పథకంలో పనిచేసే సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.