కనగల్, నవంబర్ 2: అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విర్రవీగుతున్నారని.. శాంతియుతంగా ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెలలో తనతోపాటు కార్యకర్తలపై దాడి చేయించి, అబద్ధాలతో విషప్రచారం చేస్తున్న ఈటల ఖబడ్దార్ అని హెచ్చరించారు. బుధవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం జీ యడవల్లిలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, గాయపడిన టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పల్లా మీడియాతో మాట్లాడారు. పలివెలలో ఇప్పర్తి, కిష్టాపురం గ్రామస్థులతో కలిసి బైక్ర్యాలీ నిర్వహిస్తుండగా బీజేపీ గూండాలు రాళ్ల దాడి చేశారని, ఇందుకు ప్రేరేపించిన ఈటల రాజేందర్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈటల అబద్ధాలను వల్లిస్తున్నాడని, రాజగోపాల్రెడ్డితో కలిసి నియోజకవర్గంలో డబ్బు, మద్యం, మాంసాన్ని విచ్చలవిడిగా పంచుతున్నారన్నారు. పలివెలలో టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూసి ఈటల సతీమణి బ్యూటీషియన్లతో మహిళల చేతులపై పువ్వు గుర్తులను వేస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చూపించారు. ఈటల ఎక్కడ మీటింగ్లు పెట్టినా తాము పోలేదని చెప్పారు. ‘పలివెల ఘటనలో టీఆర్ఎస్ నాయకుల చేతుల్లో కట్టెలు ఉన్నయా? బీజేపీ నాయకుల చేతిలో ఉన్నయా? మా చేతిలో రాళ్లు ఉన్నయా? వాళ్ల చేతిలో ఉన్నయా ? విజువల్స్ చూస్తే తెలుస్తుంది. టీఆర్ఎస్ నాయకుల చేతిలో కర్రలు ఉన్నట్టు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకొంటా’ అని సవాల్ చేశారు.
ఈటల క్షమాపణ చెప్పాలి
పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న ఈటల జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ అత్తగారి ఊరి(ఈటల సతీమణి స్వగ్రామం)లో క్షమాపణ చెప్పాలని పల్లా డిమాండ్ చేశారు. బడుగులకు అన్యాయం చేసి వందల ఎకరాలు సంపాదించిన ఆయన డబ్బు మదంతో కేసీఆర్, కేటీఆర్లపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పలివెల ఘటనలో టీఆర్ఎస్ కార్యకర్తలు జగదీశ్, భవనం శ్రీనివాస్రెడ్డి, సురేశ్తోపాటు మరో 8మంది గాయపడ్డారని, ఒక్క బీజేపీ కార్యకర్తకైనా దెబ్బలు తగిలాయా? అని ప్రశ్నించారు. ఈటల పీఏ నరేశ్, హైదరాబాద్ నుంచి వచ్చిన గడ్డం సాయి, ఇల్లంతకుంటకు చెందిన సురేందర్రెడ్డిలతో కలిసి టీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేయించారన్నారు. ఈటలకు దమ్ముంటే విజువల్స్ చూపించాలన్నారు. ‘విద్వేష, మతోన్మాద బీజేపీలో చేరి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న నిన్ను, నీ గంజాయి, మందు బ్యాచ్ను వదిలిపెట్టేది లేదు’ అని పల్లా హెచ్చరించారు.
సామాన్యులపైనా బీజేపీ గూండాల దాడి; ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
పలివెల గ్రామంలో బీజేపీ గూండాలు సామాన్య ప్రజలపైనా విచక్షణారహితంగా దాడి చేశారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. అక్కడ ఇంచార్జిగా పనిచేస్తున్న ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్పై బీజేపీ గూండాలు దాడి చేశారని చెప్పారు. తనపైనా దాడికి యత్నించారన్నారు. బీజేపీ వాళ్ల చేతిలో రాళ్లు ఉన్నాయని, పెద్ద పెద్ద జెండా కర్రలతో టీఆర్ఎస్ కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడి చేశారని చెప్పారు. ఈటల బీజేపీలోకి వెళ్లాకా దుష్ప్రచారం, చెత్త ప్రచారం చేయడం అలవాటు చేసుకున్నాడని విమర్శించారు. పలుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇలాంటి దాడులకు ఉసిగొల్పడం సరైంది కాదన్నారు. బీజేపీ వాళ్లు కవ్వింపు చర్యలు పాల్పడతారనే విషయాన్ని మంత్రి కేటీఆర్ తమకు ముందే చెప్పారన్నారు.