చిక్కడపల్లి, జూన్ 15 : రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేనివిధంగా స్థానికులకే 95 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ప్రముఖ రచయిత్రి రమాదేవి రచించిన ‘భారత రాజ్యాంగం- గవర్నెన్స్’ పుస్తకాన్ని బుధవారం ఆయన హైదరాబాద్ కేంద్ర గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణతో పాటు భోజనం వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు.
ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని అభ్యర్థులకు సూచించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ను ప్రకటించిందని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. పట్టుదలతో కృషి చేస్తే తప్పకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్ చెప్పారు. కార్యక్రమంలో నగర గ్రంథాలయం చైర్ పర్సన్ ప్రసన్న రాంమూర్తి, ప్రొఫెసర్ అశోక్ నాయుడు, డాక్టర్ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.